Indian Students: భారత దేశానికి చెందిన 633 మంది విద్యార్థులు 5 ఏళ్లలొ వివిధ దేశాల్లో మరణించినట్లు లోక్ సభలో విదేశాంగ సహాయక మంత్రి కీర్తి వర్థన్ వెల్లడించారు. అందులో పలు దాడుల్లో 19 మంది మరణించారని తెలిపారు. కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదాలు, వైద్యపరిస్థితులు, దాడులు వంటి కారణాల వల్ల 2019 నుంచి 41 దేశాల్లో 633 మంది మరణించారని అన్నారు.
కెనడాలో అత్యధికంగా 172 మంది ఇండియన్ స్టూడెంట్స్ మరణించారని విదేశాల్లో మంత్రిత్వ గణాంకాలు వెల్లడించాయి. తర్వాత 108 మరణాలు అమెరికాలో జరిగాయి. బ్రిటన్లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్లో ఒకరు మృతి చెందారు.
ఇదిలా ఉంటే మరో వైపు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కెనడాలో జరిగిన దాడుల్లో అత్యధికంగా తొమ్మిది మంది, అమెరికాలో ఆరుగురు మరణించగా.. ఆస్ట్రేలియా, చైనా, బ్రిటన్, కిర్గిజిస్థాన్లో జరిగిన దాడుల్లో ఒక్కరు చొప్పున మరణించారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యర్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటి అని అన్నారు.