Viral News : స్వలింగ జంటైనా, ఆలుమగలైనా బిడ్డను కనాలంటే ఎవరో ఒకరే మోయాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ స్వలింగ జంట ఒకే బిడ్డను మోసి.. పండంటి మగబిడ్డను కన్నారు. అదెలా సాధ్యమన్న డౌట్.. మీక్కూడా ఉంది కదూ. ఇదంతా నేటి టెక్నాలజీ మహిమ. పిల్లలు పుట్టక ఏళ్లు గడిచినా వారికి కూడా.. ఇన్ ఫెర్టిలిటీ సెంటర్స్ పిల్లలు పుట్టేలా చేస్తున్నాయి. ఇది సహజంగా జరగడం కష్టమైన వారికి ఒక వరంలా కనిపిస్తున్నాయి. స్వలింగ జంట బిడ్డకు జననం ఇవ్వడం కూడా వారి వల్లే సాధ్యమైంది.
స్పెయిన్ కు చెందిన ఎస్టీఫానియా, అజహారా అనే స్వలింగ జంట అక్టోబర్ 30న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వీరిద్దరూ మహిళలే. అందుకే ఇద్దరూ ఒకేసారి మాతృత్వపు అనుభూతిని పొందాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటీ సెంటర్ ను సంప్రదించగా.. ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ముందుగా ఎస్టీఫానియా గర్భంలోకి స్పెర్మ్ ని ప్రవేశపెట్టి.. అది పిండంగా మారేలా చేశారు. ఐదు రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా గర్భంలో ప్రవేశపెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి.. మాతృత్వపు అనుభూతిని పొందారు. దీనికోసం సుమారు రూ.4.5 లక్షలు ఖర్చుచేశారట. ప్రస్తుతం ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.
తామిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ, కేర్ ఉన్నాయో చెప్పేందుకు ఈ బిడ్డ గుర్తుగా ఉన్నాడని, ఆ ఆలోచనే తమకు ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తోందని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కాగా.. ఇలా ఒకేసారి ఇద్దరు బిడ్డను మోయడాన్ని వైద్యపరిభాషలో ఇన్వోసెల్ గా పిలుస్తారు. 2018లో టెక్సాస్ లో ఓ స్వలింగ జంట కూడా ఇలాగే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంటగా నిలిచారు. సరికొత్త ఆవిష్కరణలతో వైద్యరంగం అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం.