Bangladesh President| బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనకారులు రోడ్డుకెక్కారు. ఈ సారి ఏకంగా రాష్ట్రపతి అధికారిక నివాసంలోకి దూసుకుపోయారు. రాష్ట్రపతి మొహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేయాలని మంగళవారం అక్టోబర్ 22, 2024న నిరసనలు చేశారు. రాష్ట్రపతి షాబుద్దీన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ నిరసనలకు కారణం.
ఇటీవల ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మొహమ్మద్ షాబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తన వద్ద ఎటువంటి పత్రాలు, ఆధారాలు లేవని చెప్పారు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నిరసనలు జరుగుతుండగా ఆగస్టు 5, 2024న ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం వదిలి భారతదేశానికి వెళ్లిపోయారు. అయితే ఆమె వెళ్లిపోయేముందు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మిలిటరీ అధికారులు మీడియాకు తెలిపారు.
కానీ ఇప్పుడు రాష్ట్రపతి స్వయంగా ఆమె రాజీనామా చేసినట్లు ఆధారాలు లేవని చెప్పడంతో బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నిరసనకారులు రాష్ట్రపతి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ.. రాష్ట్రపతి అధికారిక నివాసమైన బంగభాబన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోకి దూసుకుపోయారు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్స్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆ తరువాత సైన్యం చేరుకొని పరస్థితి అదుపు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఒకరేమో భద్రతా దళాలు చేసిన కాల్పుల్లో గాయపడితే.. మరొకరు.. పోలీసులు వేసిన సౌండ్ గ్రెనేడ్ వల్ల గాయపడ్డాడు.
Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం
రాష్ట్రపతి రాజీనామా చేయాలని మంగళవారం రాజధాని ఢాకాలోని షషీద్ మినార్ వద్ద నుంచి విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ ప్రారంభించి ఢాకా యూనివర్సిటీ మీదుగా రాష్ట్రపతి నివాసానికి చేరుకోగా.. ఆ తరువాత పరిస్థితి హింసాత్మకంగా మారింది. నిరసనకారులకు నేతృత్వం వహిస్తునన్ హస్నత్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “రాజీనామా చేసేందుకు రాష్ట్రపతి షాబుద్దీన్ కు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. దీంత పాటు మేము చెప్పే 5 డిమాండ్లు పూర్తి చేయాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్ 1972 రాజ్యాంగాన్ని రద్దరు చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలి లేకపోతే నిరసన తీవ్రంగా మారుతుంది” అని చెప్పాడు.
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుడు ఆసిఫ్ నజరుల్.. రాష్ట్రపతి వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రపతి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. పదవిలో కొనసాగేందుకు తనకు అర్హత లేదని చెప్పారు. ఆసిఫ్ నజ్రుల్ తోపాటు ఇతర కీలక పదవుల్లో ఇతర నాయకులు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ తో మంగళవారం అనధికారిక సమావేశాలు చేశారు. రాష్ట్రపతి షాబుద్దీన్ ను పదవిని తొలగించడానికే ఈ సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్
బంగ్లాదేశ్ న్యాయ నిపుణుల ప్రకారం.. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటు ద్వారా ఇంపీచ్ మెంట్ ప్రక్రియ జరగాలి. కానీ ప్రస్తుతమున్న ఆపధర్మ ప్రభుత్వం ఆ పని చేయలేదు. దాని కోసం చట్టం అతిక్రమించాల్సి ఉంటుంది.