Vice President Kamala Harris would be President Joe Biden’s natural successor
ప్రపంచం మొత్తం ఎదురుచూసే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ 5న జరగనున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి అమెరికా ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష రేసులో నువ్వా నేనా అనే స్థాయిలో రెండు పార్టీల నేతలు పోటీపడుతున్నారు. డెమోక్రాట్ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఆ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే జో బైడెన్ కు పోటీగా మాజీ యూఎస్ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ పోటీచేస్తున్నారు. ఎన్నికలలో ఎవరికి వారు జోరుగా ప్రచార అస్త్రాలు సంధిస్తున్నారు. ఇక యావత్ ప్రపంచమంతా వీరిద్దరిలో ఎవరు ప్రెసిడెంట్ అవుతారో అని ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతా బాగానే ఉంది హఠాత్తుగా ఎన్నికల బరిలో అనూహ్యంగా కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కీలక పదవిలో ఉన్న కమలా హారిస్ భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం.
తమిళనాడు నేపథ్యం
కమలా హారిస్ కుటుంబ నేపథ్యం చూస్తే తల్లిది తమిళనాడు నేపథ్యం కాగా తండ్రిది జమైకా నేపథ్యం. వీరిద్దరి ముద్దుల కూతురే కమలా హారిస్. కాలిఫోర్నియాలో 1964 అక్టోబర్ 20న జన్మించిన హారిస్ కు తమిళనాడులోని తన తాత ప్రభావం ఎక్కువగానే ఉండేది. ఇండియాకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా తల్లిస్వగ్రామం వెళుతుంటేవారు హారిస్. తాత పి.వి. గోపాలన్ ఇండియన్ సివిల్ సర్వెంట్ గా పనిచేసేవారు. తనపై ఆయన ప్రభావం ఉండేదని హారిస్ తరచుగా చెబుతుండేవారు. అయితే 2020 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పదవిని చేపట్టి అమెరికా చరిత్రలోనే వినూత్న రికార్డు సృష్టించారు. ఎందుకంటే అప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ గా మహిళలెవరూ నియమించబడలేదు. ప్రప్రధమంగా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ఎన్నికై సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె ట్రంప్ విధానాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కోవిడ్ ను ఎదుర్కోవడంలో ట్రంప్ వైఫల్యంపై ప్రచారం చేస్తూ కమలా హారిస్ ఓటర్లను తనవైపునకు తిప్పుకున్నారు. జో బైడెన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ ప్రచారాన్ని కొనసాగించారు.
అనూహ్యంగా హారిస్ పేరు
ఇంతకీ కమలా హారిస్ ప్రెసిడెంట్ రేసులో అనూహ్యంగా ఎందుకు వచ్చారు? దాని వెనుక ఓ బలమైన కారణం కనిపిస్తోంది. ఇటీవల అధ్యక్ష పదవికి సంబంధించి ఓ ప్రముఖ మీడియాలో డిబేట్ నిర్వహించారు. ఈ కీలక డిబేట్ లో 75 సంవత్సరాలు నిండిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ పాల్గొన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన డిబేట్ లో ట్రంప్ దే పైచేయి అయింది. పాపం బైడెన్ చాలా విషయాలలో తడబడ్డారు. దీనితో రిపబ్లికన్ నేతలు పనిగట్టుకుని బైడెన్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. బైడెన్ తీవ్రమైన మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని..అందుకే డిబేట్ లో తడబడ్డారని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇదే విషయంలో సొంత పార్టీ లోనూ బైడెన్ కు వృద్ధాప్యం రీత్యా అధ్యక్ష రేసునుంచి తప్పుకుంటే బాగుంటుందని ఒత్తిడి ఎక్కువయింది. ఇదే కానీ జరిగితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ అయితే బాగుంటుందని పార్టీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
నిజం కావాలని కోరుకుంటున్న భారతీయులు
నిజంగానే కమలాహారిస్ అధ్యక్ష రేసులో గెలిచి నిలుస్తే అమెరికా అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళగా భారత కీర్తి మరింత పెరుగుతుందని 130 కోట్ల భారతీయుల హృదయాలు ఉప్పొంగే క్షణాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా భారతీయ మూలాలు ఉన్న చాలా మంది అగ్ర దేశాలలో ఉన్నత పదవులు అలంకరించారు. అయితే అమెరికా అధ్యక్ష పదవి లో మన భారతీయ మూలాలు ఉండటం మన దేశానికే గర్వకారణం అని భారతీయులంతా భావిస్తున్నారు. కమలా హారిస్ కు అధ్యక్షహోదా రావాలని యావత్ ఇండియన్స్ అందరూ మనసారా కోరుకుంటున్నారు.