UNO condemns attack on Hindus in Bangladesh: బంగ్లాదేశ్ లో ఇంకా అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. అక్కడ సాంతం అగ్గి చల్లారలేదు. ముఖ్యంగా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసి అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే హిందూ దేవాలయాలకు సంబంధి ధ్వంసం చేసే వీడియోలు వైరల్ గా మారాయి. దాదాపు 30 జిల్లాలలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని గుర్తించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ జిల్లాలకు అదనపు బలగాలను పంపించింది. అయినా ఘర్షణలు మాత్రం తగ్గడం లేదు. కొన్ని ప్రాంతాలలో హత్యలకు సైతం పాల్పడిన సంఘటనలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. అయితే బంగ్లా మీడియా ఆంక్షలతో అవన్నీ బయటపడటం లేదు. అయితే ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సీరియస్ గా పరిగణించింది.
ఖండించిన యూఎన్ఓ
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. హిందూ మైనారిటీలపై దాడులను నియంత్రించాలని..బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి తమ వంతు సాయం అందిస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన యూనస్ తమ సహాయం కోరితే తక్షణమే అందజేస్తామని..హింసాత్మక సంఘటనలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాలో తిరిగి శాంతియుత వాతావరణం ఉండేందుకు కృషి చేయాలని అన్నారు. కాగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ లోని ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్ఎస్ఎస్ నేతలు తెలిపారు. కొత్తగా వచ్చిన యూనస్ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. భారత్ లోని ముస్లిం మైనారిటీలను తాము ఎంతగా గౌరవిస్తున్నామో అలాగే బంగ్లాదేశ్ లోనూ హిందూ మైనారిటీలను సంరక్షించాలని ఆర్ఎస్ఎస్ నేతలు కోరుతున్నారు.