war: రోజులు వారాలయ్యాయి.. వారాలు కాస్త నెలలయ్యాయి.. నెలలు కూడా పోయి ఇప్పుడు ఏడాది అవుతుంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. 2022 ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో రష్యా, ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు భీకరంగా మారుతుందే తప్ప.. ముగిసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు.
ఇప్పటికే వేలాది మంది అమాయకపు ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. చాలా మంది ఉక్రెనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సరిహద్దు దేశాలకు వలసలు వెళ్లారు. ఉక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ.. తక్కవ సైనిక బలం కలిగినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా సమర్థవంతంగా పోరాడుతోంది. రష్యా సైనిక బలగాలకు ఎదురీడి ఫైట్ చేస్తుంది. దెబ్బకు దెబ్బ తీస్తోంది.
ఆ పరిస్థితులను చూస్తుంటే యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. ఇప్పటికే దీనిపై పలు దేశాలు స్పందించాయి. ఇప్పట్లో యుద్ధం ఆగదని.. మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని అభిప్రాయపడ్డాయి.
ఇక యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘2022 ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైంది. వెనుకడుగు వేయకుండా నీలం, పసుపు రంగు జెండాని పట్టుకొని పోరాడుతున్నాము. ఎదుర్కొంటున్నాము, ప్రతిఘటిస్తున్నాము. ఇది బాధ, దుఃఖం, విశ్వాసం, ఐక్యతా సంవత్సరం. మనం అజేయంగా ఉన్న సంవత్సరం. 2023 మన విజయ సంవత్సరమని మనకు తెలుసు’’ అని వీడియోలో పేర్కొన్నారు.