Ukraine: డ్యామ్ పేలిపోయింది. కాదు.. పేల్చేశారు. రష్యా దండయాత్ర జరుగుతున్న ఉక్రెయిన్లో. ఆ దేశానికి అత్యంత కీలకమైన జలాశయం. దాని పేరు నోవా కఖోవ్కా. ఈ పని చేసింది ఎవరు? రష్యానా? ఉక్రెయిన్ ఉగ్రవాదులా? మీరంటే మీరంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
తెల్లవారుజామున జరిగిందీ ఘటన. జలాశయంలోని నీరంతా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లింది. నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్ను పేల్చివేయడంతో.. నీటి వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దక్షిణ భాగంలో ఖెర్సాన్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డ్యామ్ ఉక్రెయిన్కు చాలా కీలకమైంది.
ఈ డ్యామ్ సమీపంలో కొన్నాళ్ల క్రితం ఎటాక్స్ మొదలయ్యాయి. అవి భారీ దాడులుగా మారాయి. ఇప్పుడు ఏకంగా డ్యామ్ పేలిపోయేంతలా దాడులు జరిగాయి. ఉక్రెయిన్ మిలటరీ కమాండ్ ఈ బ్లాస్ట్పై స్పందించింది. రష్యా దళాలే పేల్చివేశాయని సైనికాధికారులు ఆరోపించారు. అటు.. రష్యా కూడా ప్రతిస్పందించింది. ఉగ్రదాడిగా కొట్టిపారేసింది. అర్ధరాత్రి రెండు గంటల నుంచి కఖోవ్కా డ్యామ్పై వరుసగా దాడులు జరుగుతున్నాయని.. ఆ దాడులకు గేటు వాల్వులు దెబ్బతిన్నాయని చెప్పారు. నీటి లీకులు మొదలై.. కొద్దిసేపటికే డ్యామ్ బద్దలైపోయిందని రష్యా అధికారులు అంటున్నారు. ఖెర్సాన్లో లోతట్టు ప్రాంతాలను ఉక్రెయిన్ ఖాళీ చేయిస్తోంది.
ఈ డ్యామ్ ఎలా పేలిపోయింది.. ఎవరి పని అనేది పక్కన పెడితే.. వేల మంది ప్రమాదంలో పడ్డారు. నీపర్ నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు. డ్యామ్ పేల్చివేత కారణంగా పర్యావరణ విధ్వంసం తప్పదనీ కంగారు పడుతున్నారు. డ్యామ్ విధ్వంసంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యవసర భేటీ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.
నోవా కఖోవ్కా డ్యామ్ ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. 56లో జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా నిర్మించారు. 18 క్యూబిక్ కిలోలీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. రష్యా దళాల ఆధీనంలోకి వెళ్లినప్పటికీ గతేడాది అక్టోబర్లో ఈ డ్యామ్ను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. నాటి నుంచి ఆనకట్టను పేల్చివేస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది. వాళ్లు భయపడినట్టే జరిగింది. ఈ డ్యామ్ పేల్చివేతతో ఒకవైపు వరద కష్టాలు.. మరోవైపు కరెంటు కష్టాలు చుట్టు ముట్టనున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి చెందిన అణువిద్యుత్తు ప్లాంట్ జపోరిజియా రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడీ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ నిలిపోయింది. ఫలితంగా వందల గ్రామాల్లో వేల కుటుంబాలు చీకట్లో మగ్గిపోనున్నాయి.