Tragic Incident In River: రష్యాలో మెడిసిన్ చదువుకునేందుకు వెళ్లి వోల్ఖోవ్ నదిలో ప్రమాదవశాత్తు పడి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నలుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ మృతదేహాలను విమానంలో ముంబైకి తరలించనున్నట్లు తెలిపారు. ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి జల్ గావ్ జిల్లాలోని విద్యార్థుల స్వస్థలాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ నదిలో గల్లంతైన ఓ విద్యార్థిని నిషా భూపేష్ సోనావానే ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రష్యా అధికారులు తెలిపారు.
ఇద్దరు అన్నాచెల్లెళ్లు..
సెయింట్ పీటర్స్ బర్గ్ సమీపంలోని యారోస్లావ్ దివైస్ నోవ్ గొరోడ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు వాకింగ్ కోసమని వోల్ఖోవ్ నది వద్దకు వెళ్లినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అయితే వాకింగ్ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఓ యువతి కిందపడగా.. కాపాడే ప్రయత్నంలో నలుగురు దూకినట్లు చెప్పారు. అయితే గల్లంతైన విద్యార్థుల్లో జియా పింజారీ, జిషాన్ పింజారీ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా తెలిసింది. వీరితోపాటు మహ్మద్ యాకూబ్ మాలిక్, హర్షల్ దేశాలీలు కూడా ఉన్నారు.
Also Read: విమానానికి తప్పున పెను ప్రమాదం.. గాల్లో ఉండగానే మంటలు
అలర్ట్ జారీ
రష్యాలో జరిగిన ఈ ప్రమాదం తర్వాత అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి భారతీయ విద్యార్థులకు అలర్ట్ జారీ చేశారు. రష్యాలోని నదీ సమీపంలోని ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని భారతీయులకు అధికారులు సూచించారు. కాగా, ఈ ప్రమాదంపై బాధిత తల్లిదండ్రులు స్పందించారు. వీరంతా వాకింగ్ వెళ్లిన తర్వాత జీషన్ అతని కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ సమయంలో నదిలో నుంచి బయటకు వెళ్లాలని అతని తల్లిదండ్రులు కోరినట్లు చెప్పారని తెలుస్తోంది. తర్వాత అలల తాకిడి పెరిగి అందరూ నదిలో కొట్టుకుపోయినట్లు జీషన్ కుటుంబ సభ్యులు చెబుతూ బోరున విలపించినట్లు అధికారులు తెలిపారు.