Alexei Navalny Death Latest News : రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని సందర్శించే అవకాశం ఇప్పటివరకు కుటుంబసభ్యులకు దక్కలేదు. నావల్నీ మృతదేహం ఆర్కిటిక్ సర్కిల్లోనే ఒక మార్చురీలో ఉంచినట్టు చనిపోయిన రెండు రోజుల అనంతరం వెల్లడైంది. ఆయన తల, ఛాతీపై కమిలిన గాయాలు ఉన్నాయన్న స్థానిక మీడియా కథనం కలకలం సృష్టించింది. నావల్నీని తీవ్రంగా హింసించారా? అనే అనుమానాలు పలువురిని తొలి నుంచీ తొలిచేస్తున్నాయి.
Read more: నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?
నావల్నీ చనిపోయిన వెంటనే, ఆ తర్వాత మృతదేహం తరలింపులో ప్రొటోకాల్ పాటించలేదనే విషయం ఆ కథనం ద్వారా తెలుస్తోంది. జైల్లో ఎవరైనా మృతి చెందితే.. వారి మృతదేహాన్ని గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కు తరలించాలి. అయితే నావల్నీ విషయంలో అందుకు భిన్నంగా జరిగిందని ఆ పత్రిక తెలిపింది. ఏవో కారణాలతో మృతదేహాన్ని క్లినికల్ ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద ఇద్దరు పోలీసులను పహారాకు పెట్టారన, అంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని ఆ కథనం పేర్కొంది.
మూర్ఛ వచ్చి కింద పడిపోయినప్పుడు తగిలే గాయాల్లాగానే నావల్నీ శరీరంపై గాయాలు ఉన్నాయని ఓ వైద్యుడిని ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. నావల్నీని హింసించారంటూ వస్తున్న వార్తలను రష్యా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయనది సహజ మరణమేనని వివరించింది. చనిపోయిన మూడు రోజుల అనంతరం కూడా నావల్నీ మృతదేహాన్ని చూసేందుకు బంధువులను అధికారులు అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.