Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈనెల 22న మధ్యాహ్నం 12:29 – 12:30 సమయానికి జరుగుతుందని పండితులు నిర్ణయించారు. దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం అత్యంత శ్రేష్ఠం అని జ్యోతిష్య శాస్త్ర గ్రంధాల్లో ఉంది. పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుందని ఆగమ శాస్త్రం చెబుతోంది.
ఇక.. నేడు ద్వాదశి. ఈ భూమ్మీద ఉండే ఏ ప్రాణి కూడా ఉపవాసం ఉండని తిథి ద్వాదశి. శ్రీ మహావిష్ణువికి ఇష్టమైన తిథి ద్వాదశి. ఈ తిథికి విష్ణుమూర్తి అధిపతి. సాధారణంగా పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ చూసుకుంటే ప్రతి తిథిలోనూ ఏదో ఒక సందర్భంలో ఉపవాస నియమం పాటిస్తారు. చివరకు అమావాస్య రోజు కూడా పితృతర్పణాలు విడిచిపెట్టేవరకూ ఉపవాస నియమం పాటిస్తారు. కానీ కేవలం ద్వాదశి తిథిలో ఉపవాసం ఉండరు.. ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిథి. అంటే భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి. అందుకే ద్వాదశి తిథి అత్యంత విశిష్టమైనది. ఈ తిథిరోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశం. అందుకే ఏరికోరి ద్వాదశి తిథిని ముహూర్తంగా నిర్ణయించారు.
అభిజిత్ – ముహూర్తం. అంటే మధ్యాహ్న సమయం. ఈ సమయంలో ఏం చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణంలో ఉంది. పైగా ఈ సమయాన్ని శత్రునిర్మూలన సమయం అంటారు. అందుకే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ వదిలిపోయి దేశం సుభిక్షంగా ఉండాలనే అభిజిత్ ముహూర్తం నిర్ణయించారు.
ముహూర్తంలో గురుడుంటే ఆ కార్యక్రమం ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటంతట అవే సమసిపోతాయని విశ్వాసం. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలంగా లేవు.
చరలగ్నమైనా కానీ నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది అని వశిష్ఠ సంహితలో ఉంది. పైగా లగ్నంనుంచి ద్వితీయంలో చంద్రుడు ఉండడం చల్లదనం, శుభప్రదం. ఇలాంటి ముహూర్తం వల్ల రానున్న రోజుల్లో దేశమంతటా ఆద్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అంతా మంచే జరుగుతుందన్నది విశిష్ఠ సంహిత పేర్కొంది.