Neeru Saluja : కొందరికి ఊళ్లు తిరిగి రావడం మహా సరదా. వయసు మీద పడినా వారికి కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి ఓ పట్టాన తగ్గదు. నారద మహర్షిలా గిరగిరా ముల్లోకాలను చుట్టి వచ్చేస్తుంటారు. నీరూ సలూజా కూడా అంతే. జైపూర్కి చెందిన ఆ ప్రొఫెసర్ వయసు 70 ఏళ్లు. ఇప్పటివరకు 80 దేశాల్లో పర్యటించారు. గలాపగస్ దీవులు, ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచి నీటి సరస్సు బైకాల్ వంటివి వాటిలో ఉన్నాయి.
ఇతరుల గురించి కాకుండా మన కోసం మనం బతకాలి.. 14 సంవత్సరాలుగా నీరూ చెబుతున్న మాట ఇదే. అందుకే ఆమె తన ఆసక్తి, అభిరుచి మేరకే నడుచుకుంటుంటారు. ఆమె భర్తకూ దేశదేశాల్లో పర్యటించడమంటే ఇష్టం. 2010లో ఆయన చనిపోయేంత వరకు.. నీరును వెంటబెట్టుకుని ఎన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
భర్త మరణంతో.. నీరూ ఒంటరి అయింది. అంత మాత్రాన ఆమె ప్రపంచ యాత్రలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ఆ ప్రయాణాన్ని అలా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చింది. 80 దేశాలను చుట్టి వచ్చిన రికార్డును ఇటీవలే సొంతం చేసుకుంది. ట్రావెలింగ్పై మక్కువ పెరగడానికి కారణం ఏమిటో ఆమె వివరించారు.
చిన్నతనంలో సైకిల్పై స్కూల్కు వెళ్తుండగా ఆమె ఓ చిన్న ప్రమాదానికి గురైంది. ఎడమకాలు విరగడంతో రెండు నెలలు మంచానికి అతుక్కుపోవాల్సి వచ్చింది. విశ్రాంతితో పాటు ముమ్మరంగా ఫిజియోథెరపీ తీసుకోక తప్పలేదు. తోటి పిల్లలంతా బడి బాట పడుతుంటే.. నీరూ మాత్రం గదికే పరిమితమైంది. కిటికీలోంచి కనిపించే నీలాకాశం తప్ప టీవీ వంటి వినోద సాధనాలేవీ లేవు. నింగిలో బిరబిరా కదిలిపోయే మేఘాలను చూస్తూ ఉండిపోయేది.
మంచంలోనే ఉన్నా.. ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నట్టు ఓ అనిర్వచనీయమైన అనుభూతి ఆమెలో కలిగింది. భూగోళం మొత్తం చుట్టి వస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి ఆ క్షణంలోనే మొగ్గ తొడిగింది. ఆరుదశాబ్దాల అనంతరం కూడా నీరూ మదిలో అది సజీవంగానే ఉంది. 80 దేశాలు తిరిగొచ్చినా.. ప్రతి ట్రిప్ తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె చెప్పింది. ప్రతి పర్యటనా ఓ అనుభవాన్ని నేర్పిందని తెలిపింది.
అలాంటి వాటిలో యూరప్ ట్రిప్ ఒకటి. 2014లో ఒంటరిగానే ఆ ప్రయాణం చేసిందామె. సోలో ట్రావెల్ అనుభూతి ఎలా ఉంటుందో అప్పుడే తొలిసారిగా ఆమెకు అవగతమైంది. ఎవరూ లేకున్నా కూడా పర్యటనలు పూర్తి చేయొచ్చనే ఆత్మ విశ్వాసం కలిగించింది ఆ టూర్. 2017 శీతాకాలంలో స్వీడన్ ట్రిప్ రైలులోనే సాగింది. విదేశాల్లో రైళ్లు మనలాగా ఉండవని చెప్పారామె.
ఎవరు పడితే వారు రైలు ఎక్కడం, దిగడం-అటూ, ఇటూ తిరగడం వంటివి ఎక్కడా కనిపించవన్నారు. ఎవరి కంపార్ట్మెంట్కు వారు పరిమితమవుతారని వివరించారు. ట్రైన్ ఎక్కగానే ప్రతి వ్యక్తికీ వాష్రూం కీ ఒకటి అందజేస్తారని తెలిపారు. ఓ పెద్ద హోటల్లో వాష్రూముల్లాగా సకల వసతులు వాటిలో ఉంటాయి. స్టాక్హోం నుంచి అబిస్కో వరకు అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదని గుర్తు చేసుకుంది నీరూ.
నార్తర్న్లైట్స్కు అబిస్కో ఎంతో ప్రసిద్ధి పొందింది. అలాగే మాస్కో నుంచి బీజింగ్ వరకు రైలు ప్రయాణం కూడా ఎంతో ఆహ్లాదంగా సాగిందని నీరూ తెలిపింది. నీరూ ట్రావెలోగ్లో కొన్ని సాహసయాత్రలూ ఉన్నాయి. మెల్బోర్న్లో 12 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేయడం ఆమెకు ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చింది. అలాగే దేశంలో నాగాలాండ్ టూర్ను మరిచిపోలేనని ఆమె పేర్కొంది.
ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టి వచ్చేందుకు సీనియర్ సిటిజన్లు ప్రయత్నించాలని నీరూ చెబుతుంటారు. ఎవరి కోసం ఎదురుచూడకుండా సోలోగానే పర్యటించి వచ్చేందుకు మానసికంగా సంసిద్ధులు కావాలనేది ఆమె ఫిలాసఫీ.