Randhir Jaiswal: పొరుగు దేశం నుంచి నిష్పాక్షిక ధోరణి కనిపిస్తోందంటూ భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది. భారత్ తో కుదుర్చుకున్న ‘లాహోర్ డిక్లరేషన్’ ను పాకిస్థాన్ ఉల్లింగించిందంటూ ఆ దేశానికి చెందిన మాజీ ప్రదాని నవాజ్ షరీఫ్ ఇటీవల అంగీకరించిన విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించి ఈ విధంగా వ్యాఖ్యానించింది. అణ్వాయుధాల వాడకం నివారణ, రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం విషయమై 1999 ఫిబ్రవరి నెలలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకం చేశారు.
దీనిపై నవాజ్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది ముమ్మాటికీ తప్పేనంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టినందునే కార్గిల్ యుద్ధం జరిగిందని ఆయన చెప్పారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందించారు. ఈ విషయంలో భారత్ వైఖరేంటో అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై పాకిస్థాన్ లోనూ నిష్పాక్షిక దృక్పథం ఏర్పడినట్లు గమనించామంటూ ఆయన స్పందించారు.
Also Read: చైనాలో మరో కొత్త వైరస్.. సోకితే 3 రోజుల్లోనే మరణం
అదేవిధంగా మాల్దీవులతో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ అంశానికి సంబంధించి ప్రతిపాదనలేం లేవని రణ్ ధీర్ జైశ్వాల్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎప్టీఏ కుదుర్చుకునేందుకే భారత్ ప్రయత్నాలు చేస్తున్నదని ఇటీవల మాల్దీవుల మంత్రి మహ్మద్ సయీద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.