Parrots : ప్రకృతి అందాలు ఓ వైపు.. పక్షుల కిలకిలలు మరోవైపు.. మనసును సేదదీర్చే ఆ అనుభూతి మాటలకు అందదు. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలో పక్షుల పాత్ర కొట్టిపారేయలేనిది. పంటలకు అవి ఆప్తమిత్రులు. పురుగులను ఏరుకు తింటూ.. పంటలను రక్షించడంలో వాటికి అవే సాటి. విత్తనాలను ఆహారంగా తీసుకుని విసర్జించడం ద్వారా కొత్త ప్రదేశాలకు వృక్షజాతులను వ్యాప్తి చేయగలవు. అలాంటి నేస్తాలు క్రమేపీ అంతర్థామనవుతున్నాయి.
ఇప్పటికే 300 కోట్ల పక్షులను మానవ జాతి కోల్పోయింది. వాటిలో 90% 12 పక్షిజాతులకు చెందినవే. మనకు తెలిసిన పక్షు జాతులు 11,154 మాత్రమే. వాటిలో 159(1.4%) జాతులు అంతరించిపోయాయి. మరో 226(2%) జాతులు అంతరించే దశలో ఉన్నాయి. అత్యంత అరుదైన మిచల్స్ లోరికీట్ వాటిలో ఒకటి. చిలుక జాతుల్లో ఒకటైన మిచల్స్ లోరికీట్ పక్షులు ప్రస్తుతం ప్రపంచంలో పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఇండొనేసియాలోని బాలి, లొంబాక్ దీవుల్లో ఒకప్పుడు ఇవి ఉనికిలో ఉండేవి. 2020లో బాలిలో ఏడు చిలుకలు మాత్రమే ఉన్నట్టు కన్జర్వేషనిస్టులు తెలిపారు.
అక్రమ వేట కారణంగా ఈ చిలుకలు అంతరించిపోతున్నాయి. సాధారణ చిలుకలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. బ్రైట్ కలర్స్తో ఎంతో ముద్దుముద్దుగా ఉండే ఈ చిలుకలను ఎక్కువగా పెంచుకుంటారు. బహుమతులుగా కూడా అందజేస్తుంటారు. అందుకే వీటికి విపరీతమైన డిమాండ్. బ్రిటన్లోని చెస్టర్ జూలో ఇటీవల మిచల్స్ చిలుకలు రెండు పిల్లలను పొదగడంతో బర్డ్ లవర్స్ పులకించిపోతున్నారు.
ఆ జాతి చిలుకల సంతతి వృద్ధి కావడంపై కొత్త ఆశలు చిగురిస్తున్నట్టు చెస్టర్ జూ అధికారులు తెలిపారు. అంతరించిపోయే దశలో ఉన్న మిచల్స్ లోరికీట్స్ను కాపాడుకునే అవకాశాలు మెరుగైనట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వాటితో కలిపి ఈ జూలో మిచల్స్ చిలుకల సంఖ్య 12కి చేరింది. పక్షిజాతులను పరిరక్షించేందుకు 2018లో ప్రత్యేకంగా ఈ జూలో బ్రీడింగ్ ప్రోగ్రాంను చేపట్టారు. మిచల్స్ లోరికీట్స్ పరిరక్షణ కోసం జావాలోని చికనంగా కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ సిబ్బందితో కలిసి చెస్టర్ జూ అధికారులు పనిచేస్తున్నారు.