Telegram France| టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సిఈవో పావెల్ డురోవ్ ని గత శనివారం ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఫ్రాన్స్ లోని లి బోర్గెట్ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పావెల్ డురోవ్ ని నాలుగు రోజులు ప్రశ్నించిన తరువాత బుధవారం విడుదల చేశారు. కోర్టులో పావెల్ డురోవ్ కు వ్యతిరేకంగా గత నెల ప్రారంభమైన కేసు విచారణలో భాగంగా ఆయనను అరెస్టు చేశారు.
పావెల్ రూపొందించిన ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ని సాధారణ ప్రజలను మోసగించేందుకు, వారిని దోచుకునేందుకు క్రిమినల్స్ ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పావెల్ డురోవ్ ని చాలా దేశాలు డిమాండ్ చేసినా.. ఆయన టెలిగ్రామ్ యాప్ లో ఎలాంటి మార్పులు చేసేది లేదని చాలా సార్లు సమాధాన మిచ్చారు. దీంతో ఆయన పై కేసు నమోదైంది. బుధవారం ఫ్రాన్స్ కోర్టులో విచారణలో పాల్గొన్న డురోవ్ కు బెయిల్ ఇస్తూ.. న్యాయమూర్తులు.. అయిదు మిలియన్ యూరోలు చెల్లించి, పోలీస్ స్టేషన్ లో వారానికి రెండు రోజులు హాజరుకావాలని షరతులు విధించారు.
రష్యాలో జన్మించిన పావెల్ డురోవ్కు .. ఆగస్టు 2021లో ఫ్రాన్స్ పౌరసత్వం లభించింది. అయితే పావెల్ కు చెందిన టెలిగ్రామ్ ని డ్రగ్స్ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక వేధింపులు చేసేందుకు ఉపయోగించే మెటీరియల్ సరఫరాకు ఉపయోగిస్తున్నరని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ కు సంబంధించి కీలక డేటాని సమర్పించాలని ఆయనను ఇంతకుముందు ఆదేశించినా ఆయన అందుకు అంగీకరించలేదు.
మరోవైపు పావెల్ ను ఫ్రాన్స్ అరెస్ట్ చేయడంపై రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. పశ్చిమ దేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛను అణచి వేసేందుకే పావెల్ ని ఖైదు చేశాయని రష్యా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు మండిపడ్డారు. ఇంతకుముందు రష్యా నుంచి టెలిగ్రామ్ కార్యకలాపాలు నిర్వహించే పావెల్ 2018లో రాజకీయ ఒత్తిడి కారణంగా రష్యాను వీడి ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు. అయితే ఆయన ప్రస్తుతం దుబాయ్ నుంచి టెలిగ్రామ్ ఆఫీస్ నడుపుతున్నారు.
టెలిగ్రామ్ యాప్ ద్వారానే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా కీలక సమాచారం.. మిలటరీకి చేరవేస్తోంది. కానీ రష్యా మిత్ర దేశమైన ఇరాన్ మాత్రం పావెల్ ని అరెస్టు చేసినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
Also Read : ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !
రష్యా చేస్తున్న ఆరోపణలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ స్పందించారు. పావెల్ డురోవ్ అరెస్టు రాజకీయ కక్ష కాదని.. అది ఒక స్వతంత్ర విచారణ మాత్రమే నని తెలిపారు. తమ దేశ భద్రత, పౌరులకు నిజజీవితంతో పాటు, సోషల్ మీడియాలో కూడా భద్రతకు టెలిగ్రామ్ ద్వారా ముప్పు ఉందని అందుకే చర్యలు తీసుకున్నామని ట్వీట్ చేశారు.
అయితే ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్న పావెల్ ని అరెస్టు చేయడంపై యుఎఈ ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించింది. పావెల్ డురోవ్ కు చట్టపరంగా అవసరమైనంత సహాయం చేయాలని.. ఆయనకు మంచి లాయర్ ఏర్పాటు చేయాలని యుఎఈ ప్రభుత్వం ఫ్రాన్స్ ని కోరింది. పావెల్ కు ఇటీవలే యుఎఈ దేశం కూడా పౌరసత్వం ఇచ్చింది.
రష్యా, యుక్రెయిన్ దేశాల్లో ప్రజలు టెలిగ్రాప్ యాప్ ని వార్తలు తెలుసుకునేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు.
Also Read: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!