IBM: ఐటీ రంగంలో ఆర్థిక మాంద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు తట్టుకోలేక పోతున్నాయి. ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీగా ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
మొత్తం ఉద్యోగుల్లో 1.5 శాతం మందిని అంటే 3900 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్లు వెల్లడించింది. లక్ష్యాలు తగ్గడంతో పాటు కొన్ని అసెట్ డివెస్ట్మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని తెలిపింది. అలాగే క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని వెల్లడించింది.
ఇప్పటికే మాంద్యం దెబ్బకు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.