Mob Violence in Kyrgyzstan(Today’s international news): కిర్గిస్థాన్ దేశంలో ఉన్న భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశ రాజధాని బిషెక్ లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో.. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని ఇండియన్ ఎంబసీ X వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే 0555710041 నంబర్ ను సంప్రదించాలని పేర్కొంటూ 24 గంటలు అందుబాటులో ఉండే మొబైల్ నంబర్ ను షేర్ చేసింది.
మే 13న కిర్గిస్థాన్, ఈజిప్ట్ కు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలే ఈ దాడులకు కారణమైనట్లు కేంద్రం పేర్కొంది. కిర్గిస్థాన్లో ఈజిప్ట్కు చెందిన విద్యార్థులకు, లోకల్ స్టూడెంట్స్కు మధ్య వారం క్రితం ఘర్షణ జరిగింది. అది అంతకంతకూ పెరిగింది. దాడులు విస్తృతం అయ్యాయి. ఈజిప్ట్ విద్యార్థులతో పాటు పాకిస్తాన్ స్టూడెంట్స్ను సైతం లోకల్స్ టార్గెట్ చేసుకున్నారు. తరిమి తరిమి కొడుతున్నారు. ముగ్గురు పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. బిషెక్లో ఉండే భారత్, బంగ్లాదేశ్ విద్యార్థులను సైతం టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. అక్కడి అధికారులతో చర్చించారు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. అదే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు ఉంటోన్న బిషెక్ లలోని కొన్ని విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై హింసాకాండ జరిగినట్లు పాకిస్తాన్ మిషన్ వెల్లడించింది. బిషెక్ లో చదువుతోన్న కొందరు పాకిస్తానీ విద్యార్థులు శుక్రవారం అర్థరాత్రి మూకుమ్మడి హింసను ఎదుర్కొన్నారు. అయితే ఇంతవరకూ విద్యార్థులు మరణించిన దాఖలాలేవీ నమోదు కాలేదు. పాకిస్తానీ విద్యార్థుల మరణాలు, అత్యాచార ఘటనలు జరిగినట్లు ఇంతవరకూ ధృవీకరించబడలేదని రాయబార కార్యాలయం వెల్లడించింది.