Shivaji’s Legendary Wagh Nakh weapon Comes Home from London museum
భారతదేశం చరిత్రలో చిరస్థాయిగా పేరుగాంచిన యుద్ధ వీరులు ఎందరో ఉన్నారు. వారిలో హిందూ జాతి ఐక్యత కోసం పాటుపడి నాటి మొగలులతో వీరోచితంగా పోరాడి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. ఆయన పేరు చెబితే చాలా శత్రువులు సైతం గడగడలాడిపోతారు. అఖండ భరతజాతి ముద్దుబిడ్డగా కీర్తి ప్రతిష్టలు పొందిన శివాజీ ఉపయోగించిన వ్యాఘ్ నఖ్ ఆయుధం బ్రిటీష్ మ్యూజియం నుంచి భారత్ కు వచ్చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ మంగంటివార్ మీడియాకు స్పష్టం చేశారు.
జూన్ 19 నుంచి పబ్లిక్ ప్రదర్శన
ఇప్పటిదాకా లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. ఇటీవల కాలంలో భారత్ కు మన జాతి చారిత్రక ఆనవాళ్లను రప్పించే ప్రక్రియ వేగవంతం చేశారు కేంద్ర సాంస్కృతిక శాఖ. ఎక్కడెక్కడ భారత కళాఖండాలు ఉన్నాయో వాటిని తిరిగి భారత్ కు రప్పించేలా ఆయా దేశాధినేతలతో మాట్లాడి వారిని ఒప్పించే పనిలో ఉన్నారు. ఈ నెల 19 నుంచి మహారాష్ట్ర లోని సతారా శివాజీ మ్యూజియంకు తరలించి అక్కడ పబ్లిక్ సందర్శనార్థం ప్రదర్శన జరపనున్నారు.
ఒరిజినల్ కాదని వాదన
చరిత్ర ప్రసిద్ధిగాంచిన మరాఠా వార్ లో ఈ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించారని అంటారు. ఈ ఆయుధాన్ని ఉపయోగించి సతారాను తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. నాటి మొగల్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ను ఇదే ఆయుధంతో చంపాడని మరికొన్ని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి.బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు మన చారిత్రక ఆనవాళ్లను తీసుకెళ్లి తమ మ్యూజియంలో భద్రపరుచుకున్నారు. అయితే ఇప్పుడు వాటిని తిరిగి భారత్ కు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు భారత ప్రధాని. అయితే లండన్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధం ఒరిజినల్ కాదని కొందరు వాదిస్తున్నారు. శివాజీ ఉపయోగించిన వ్యాఘ్ నఖ్ అనే ఆయుధం శివాజీ వారసుల వద్దే భద్రంగా ఉందని అంటున్నారు. అయితే ఈ వాదనతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏకీభవించడం లేదు.
మహారాష్ట్ర సీఎం చేతుల మీదుగా
ఈ నెల 19న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే శివాజీ ఆయుధ ప్రదర్శన ఏర్పాటు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గననున్నారు. ఇన్నాళ్లూ చరిత్ర పాఠాలలో వినడమే తప్ప చూడటం తమ అదృష్టమని..ఇప్పటికైనా భారత్ కు మన జాతి గర్వించ దగ్గ యోధుడి ఆయుధం రప్పించడం అభినందనీయమని కొందరు మహారాష్ట్ర వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆయుధాన్ని ముందుగా సతారాలోని శివాజీ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. తర్వాత ముంబై సీఎస్ఎంపీఎస్, నాగపూర్ సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ తదితర ప్రాంతాలలో ప్రదర్శిస్తారని మహారాష్ట్ర అధికారులు చెబుతున్నారు.