Russian missiles Hit a Children’s hospital in Kyiv: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. కీవ్ సహా ఆ దేశవ్యాప్తంగా పలు నగరాలపై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 20 మంది వరకు మృతిచెందారు. 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
కీవ్లో ఉన్న హాస్పిటల్ ఓఖ్మాత్డిత్.. ఇది దేశంలోని అతిపెద్ద చిన్నారుల ఆసుపత్రి. దీనిపైనా కూడా రష్యా దాడులు చేసింది. నాలుగు నెలల వ్యవధిలో రాజధానిపై జరిగిన దాడులలో ఇదే అతిపెద్దది. పేలుళ్ల ధాటికి స్థానికంగా ఉన్న భవనాలు దద్దరిల్లాయి. కీవ్ నగరంలో ఏడుగురు మృతిచెందారు. క్రీవిరీహ్ లో 10 మంది మృతిచెందగా, దొనెట్స్క్లోని పోక్రోవ్స్క్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అత్యాధునిక కింజాల్ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన ఆరోపిస్తోంది. 40కి పైగా క్షిపణులతో తమ దేశంలోని ఐదు నగరాలను మాస్కో లక్ష్యంగా చేసుకున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు. పిల్లల ఆసుపత్రి భవనం పాక్షికంగా ధ్వంసమైందని, శిథాలల కింద చిక్కుకుపోయినవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
Also Read: డెట్రాయిట్లో భారీ కాల్పులు.. ఇద్దరు మృతి, 19 మందికి తీవ్ర గాయాలు!
ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదన్నారు. రష్యా ఏం చేస్తుందో అందరూ గమనించాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, అమెరికాలో నాటో శిఖరాగ్ర సమావేశాల సమయంలో ఈ దాడులు చేసుకోవడం గమనార్హం.