Israel Rocket Attack : ఇజ్రాయెల్పై భీకర రాకెట్ దాడులు జరిగాయి. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు 5 వేలకు పైగా రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ను ప్రారంభించిన హమాస్ సాయుధ విభాగం.. 20 నిమిషాల పాటు రాకెట్ల దాడికి పాల్పడింది. పవిత్ర నగరం జెరూసలెం సహా, ఇజ్రాయెల్ అంతా మంటలు ఎగసిపడుతున్నాయి. అంతేకాదు.. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ తీవ్రవాదులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపారు. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక మంది ఉగ్రవాదులు చొరబడటంతో… గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు ఇళ్లలోనే ఉండాలని ఇజ్రాయెల్ సైనిక దళాలు సోషల్ మీడియాలో ప్రజల్ని హెచ్చరించాయి. హమాస్ మిలిటెంట్ల దాడుల్ని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. దాడిలో ఉగ్రవాదులు పారాగ్లైడర్లను కూడా ఉపయోగించారు. తాజా దాడులపై సమీక్ష నిర్వహించేందుకు.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో భద్రతా దళాధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా హింస పెరుగుదలను తాజా దాడి సూచిస్తోందని అభిప్రాయపడింది.
ఇవాళ సెలవు రోజు కావడంతో ఇజ్రాయెల్ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. గాజా నుంచి సైరన్లు మోగించి ఎమర్జెన్సీ ప్రకటించడం, రాకెట్లను పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ధైర్యంగా ఉండి, పోరాడాలని ఇజ్రాయెల్ రక్షణ దళం పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల వీడియోలను అక్కడి పౌరులు ఇళ్లలో నుంచే వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.