Navlny : పోలార్ వుల్ఫ్.. రష్యాలోనే అత్యంత కఠిన కారాగారాల్లో ఒకటి. సైబీరియాలోని ఈ పీనల్ కాలనీ(జైలు) నుంచి తప్పించుకోవడం దుర్లభం. మాస్కోకు ఈశాన్యంగా 1900 కిలోమీటర్ల దూరంలో యమల్-నెనెత్స్ రీజియన్లోని ఖార్ప్ పట్టణంలో ఉందీ కాలనీ. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను నిత్యం తూర్పారబట్టే విపక్ష నేత అలెక్సీ నావల్నీని మూడు వారాల క్రితం అత్యంత రహస్యంగా తరలించింది ఇక్కడికే.
జైలు నుంచి నావల్నీ అదృశ్యమయ్యారన్న వార్తలు ఇటీవల సంచలనం కలిగించాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి నావల్నీని కలవలేపోతున్నామంటూ ఆయన న్యాయవాదులు రెండో వారంలో ప్రకటించారు. జైలుగదిలో అనారోగ్యానికి గురైన నాటి నుంచీ నావల్నీ ఆచూకీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదం ఆరోపణలపై 2021లో ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష పడింది.
గ్యాస్ నిల్వలు అత్యధికంగా ఉన్న యమల్-నెనెత్స్ అటానమస్ రీజియన్లో జనావాసాలకు దూరంగా విసిరేసినట్టు ఉండే జైలులో నావల్నీని ఉంచినట్టు న్యాయవాదులు వెల్లడించారు. నావల్నీ ఆచూకీ తెలపాలంటూ వారు రష్యా ప్రభుత్వానికి 618 వినతులు అందజేయాల్సి వచ్చింది.
మరో మూడు నెలల్లో రష్యాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. ఆయనను అత్యంత దుర్భరమైన ఏకాంత ప్రదేశానికి తరలించినట్టు తెలుస్తోంది. అధికారం కోసం ఆరోసారి పుతిన్ పోటీపడుతున్నారు. ఆయన గెలుపొందితే.. స్టాలిన్ తర్వాత రష్యాను అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డులను తిరగరాస్తారు.
ఈ పీనల్ కాలనీలో నిర్బంధం అంటో ఓ ర కంగా నరకమే. ఆర్కిటిక్ సర్కిల్కు 60 కిలోమీటర్ల ఎగువన ఉన్న ఈ జైలు 1960లో ఆరంభమైంది. ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిని ఐకే-3 పీనల్ కాలనీకి తరలిస్తారు. శీతాకాలంలో ఇక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 28 సెల్సియస్ డిగ్రీలకు పడిపోతాయి. ఇలా వారాల పాటు గడ్డకట్టే శీతల వాతావరణం కొనసాగుతుంది.
పీనల్ కాలనీకి చేరుకోవడం చాలా కష్టమని న్యాయవాదులు చెబుతున్నారు. ఆఖరికి ఉత్తరాలు పంపాలన్నా అసాధ్యమేనని అంటున్నారు. రష్యాలో ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకి తరలించే విధానం అతి క్రూరంగా ఉంటుంది. కొన్ని వారాల పాటు వారు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా ఉండదు. అసలు జీవించి ఉన్నారా? లేదా? అనేది కూడా తెలియదు. అంత రహస్యంగా ఖైదీలను జైళ్ల నుంచి తరలించేస్తారు.
ఐకే-3 పీనల్ కాలనీలో సరైన దుస్తులు ఇవ్వరని, గడ్డకట్టే చలిని చవిచూడాల్సి వస్తుందని మాజీ ఖైదీలు చెబుతుంటారు. తానిక్కడ అడుగు పెట్టినప్పుడు ఒక జత వింటర్ బూట్లు, చిరిగిపోయిన కోటును మాత్రమే ఇచ్చారని మాజీ ఖైదీ మాగ్జిం బఖ్ వలోవ్ తెలిపారు. వేసుకునేందుకు కూడా వీలు కాని దుస్తుల వల్ల తరచూ అనారోగ్యానికి గురయ్యాయని, కొత్తవి అడిగినా జైలు అధికారులు పట్టించుకోరని మరొక ఖైదీ తెలిపారు. గాలి, వెలుతురు లేని చీకటి గుయ్యారాల్లో శిక్ష అనుభవించాలని, వేడినీళ్లు సైతం కరువేననేది మరొక ఖైదీ అనుభవం. ఇక ఇక్కడ పెట్టే చిత్రహింసల గురించి చెప్పనలవి కాదని మరికొందరు చెబుతారు.