Putin Welcomes Trump: ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాని యుద్ధ భూమిలో ఓడించగలమని భావించడం అమెరికాకు ఒక కలగానే మిగిలిపోతుందని ఆయన చెప్పారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు గురువారం రాత్రితో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో రష్యా మిత్రదేశాలు ఉక్రెయిన్ యుద్ధం ముగించాలని కోరారు. దీంతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాట్లాడుతూ.. “ఉక్రెయిన్ భూభాగంలో రష్యా స్థావరాలకు పశ్చిమ దేశాలు అధికారిక గుర్తింపు నివ్వాలి. అలా చేస్తేనే శాంతి చర్చలకు అంగీకరిస్తాం. అలా కాకుండా రష్యాను యుద్ధభూమిలో ఓడించగలమని భావిస్తే అది వాళ్లు కంటున్న అందమైన కలగానే మిగిలిపోతుంది. యుద్ధంలో ఓడిపోయిన చరిత్ర ఇంతవరకు రష్యాకు లేదు. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా, రష్యా మధ్య శాంతికోసం మధ్యవర్తిత్వం చేస్తే దానికి స్వాగితిస్తాం. కానీ ఎటువంటి షరతులైనా అవి అంగీకార యోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. కానీ అందుకు అమెరికా ఎన్నికలే కీలకం.
అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. వారు రష్యాతో సన్నిహితంగా ఉండాలనుకుంటే దాన్ని స్వాగతిస్తాం. కానీ వాళ్లు రష్యాపై కాలు దువ్వితే అందుకు కూడా మేము సిద్ధమే. అమెరికా మాజీ అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు నిజాయితీగా కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను. అమెరికా, రష్యా సంబంధాలు ఎలా ఉండాలో అది అమెరికా నాయకులు చర్చలకు ముందుకు వస్తే తెలుస్తుంది. ” అని అన్నారు.
Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం
రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ, న్యూక్లియర్ అంశాలపై రష్యా, అమెరికా మధ్య మొదలైన కోల్డ్ వార్ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత కొరియా, వియత్నాం యుద్ధాల సమయంలో కూడా రెండు దేశాలు వ్యతిరేక శిబిరాల్లో ఉన్నాయి. అయితే ఆ తరువాత క్రమంగా రెండు దేశాల నాయకులు చర్చలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే ఉక్రెయిన్ నాటో దేశాల కూటమిలో చేరడంపై రష్యా వ్యతిరేకతను అమెరికా, పశ్చిమ దేశాలు రాజకీయం చేయడం మళ్లీ అమెరికా, రష్యా దేశాలు బద్ధ శత్రువులుగా మారిపోయాయి.
గతంలొ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే కొన్ని గంటల వ్యవధిలోనే ముగించేస్తానని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బిలియన్ల డాలర్లు గురించి ఆయన అప్పుడు ప్రశ్నించారు.
అయితే ఉక్రెయిన్ యుద్ధానికి కారణమేదైనా ప్రపంచదేశాలు తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నాయి. దీంతో బ్రిక్స్ సదస్సులో చైనా, ఇండియా సహా అందరూ ఉక్రెయిన్ యుద్ధానికి త్వరగా ముగిసిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరాయి.
బ్రిక్స్ సదస్సుకు ముందు పుతిన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరెస్ ని కలిశారు. ఉక్రెయిన్, గాజా, లెబనాన్ లో యుద్ధం ఆపేందుకు న్యాయపరంగా సాయం చేయాలని గుటెరెస్ ని పుతిన్ కోరారు. బ్రిక్స్ సదస్సులో కూడా అన్ని భాగస్వామి దేశాలు పాలస్తీనాకు న్యాయం చేయాలని గళమెత్తారు. పాలస్తీనా అధ్యక్సుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ.. లక్షల మంది గాజా వాసులు ఆకలితో చనిపోయేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి స్థాపన కోసం బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ప్రయత్నం చేయాలని.. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు వేర్వేరు దేశాలుగా కొనసాగడమే దీనికి పరిష్కారమని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెప్పారు.