Indian stuck in Foreign for 23 years| స్వదేశంలో వచ్చే సంపాదన సరిపోక కుటుంబాన్ని పోషించకడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి మంచి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లాలనుకున్నాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వీసా రాకపోవడంతో దొంగదారిన చాలా దేశాలు దాచుకుంటూ ఎన్నో సమస్యలు పడి చేరాల్సిన గమ్యం చేరుకున్నాడు. అయితే అక్కడికి వెళ్లాక తన పాస్ పోర్ట్ పొగొట్టుకున్నాడు. పైగా ఆ దేశంలో ఊహించని ప్రమాదాలు ఎదురయ్యాయి. దీంతో ఇండియాకు తిరిగి రావాలని ప్రయత్నించినా అతడిని భారత ప్రభుత్వం గుర్తించలేదు. పాస్ పోర్ట్ లేనందున అతను కొత్త పాస్ పోర్ట్ కోసం ప్రయత్నించాడు.
అలా ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉండగా.. ఒకరోజు అనుకోకుండా అతనికి సాయం అందింది. దీంతో ఎన్నో కష్టాలు పడి 23 ఏళ్ల తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. కానీ తన ఇంట్లో అంతా మారిపోయింది. ఎంతో సమయం గడిచిపోయింది. ఈ కథ పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్ తేజ్ సింగ్ ది.
Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ
పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాకు చెందిన గుర్ తేజ్ సింగ్ 2001లో అతనికి 31 ఏళ్ల వయసున్నప్పుడు.. అక్కడ ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసేవాడు. అతనికి ఇంట్లో తల్లి, సోదరుడు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇంట్లో అతనొక్కడే పనిచేసే సంపాదించే వ్యక్తి. దీంతో అందరినీ పోషించడం అతనికి చాలా కష్టంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుర్ తేజ్ సింగ్ మరో ఉద్యోగం కోసం వెతుకుతుండగా అతనికి విదేశాల్లో పనిచేస్తే ఎక్కువ సంపాదించవచ్చు అని తెలిసింది. దీంతో అతను లెబనాన్ దేశంలో ఉపాధి లభిస్తుందని తెలిసి ప్రయత్నించాడు. కానీ గుర్ తేజ్ సింగ్ చదువుకోకపోవడంతో అతనికి సరైన ఉద్యోగం లేదా వీసా లభించలేదు.
అయితే ఆ దేశంలో కూలి పనిచేసినా సంపాదించవచ్చునని.. పైగా అక్కడికి వీసా లేకుండా చట్ట వ్యతిరేకంగా దొంగచాటుగా ఒక ఏజెంట్ తీసుకెళ్తాడని తెలిసింది. లెబనాన్ దేశానికి తీసుకెళ్లే ఆ ఏజెంట్ ను సంప్రదించాడు. ఆ ఏజెంట్ తనకు రూ.1 లక్ష ఇస్తే తీసుకెళతానని డిమాండ్ చేశాడు. దీంతో గుర్ తేజ్ సింగ్ అప్పులు చేసి లక్ష రూపాయలు ఏజెంట్ కు ఇచ్చాడు. ఆ తరువాత భూ మార్గాన, సముద్ర మార్గాన దొంగచాటుగా జోర్డాన్, సిరియా దేశాల మీదుగా చాలా రోజులు ప్రయాణించి గుర్ తేజ్ లెబనాన్ చేరుకున్నాడు. అతని వద్ద వీసా లేకపోవడంతో కొన్ని రోజులు లెబనాన్ రాజధాని బెయిరుట్ లో పోలీసుల చేతికి చిక్కకుండా దొంగచాటుగా జీవించాడు.
Also Read: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..
అయితే అక్కడ అతనికి పని లభించకపోవడంతో రాజధాని వదిలి సమీపంలోని గ్రామాల్లో పొలం పనులకు వెళ్లేవాడు. అలా సంపాదించిన డబ్బులను ఇండియాలోని తన కుటుంబానికి చేరవేసేవాడు. ఈ క్రమంలో అనుకోకుండా దాదాపు 15 సంవత్సరాల క్రితం లెబనాన్ పై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు చేసింది. దీంతో లెబనాన్ లోని హిజ్బుల్లా సాయుధ పోరాట దళం కూడా ఇజ్రాయెల్ పై ఎదురు దాడి చేసింది. ఇదంతా చూసి గుర్ తేజ్ భయపడి పోయాడు. అక్కడ జీవించడం కన్నా స్వదేశానికి తిరిగి పోవడం మంచిదని భావించాడు. కానీ అక్కడి నుంచి తిరిగి రావడానికి ఆ సమయంలో ఎవరూ సాయం చేయలేదు. పైగా గుర్ తేజ్ తన పాస్ పోర్ట్ ని పోగొట్టుకున్నాడు.
గుర్ తేజ్ తన స్వదేశానికి వెళ్లిపోవడానికి భారత ఎంబసీకి వెళ్లి సాయం చేయమని అడిగాడు. కానీ గుర్ తేజ్ చట్టవ్యతిరేకంగా లెబనాన్ లో ప్రవేశించడంతో భారత ఎంబసీ అధికారులు తమ వద్ద అతను ఇండియా నుంచి అక్కడికి ఉపాధిపై వచ్చినట్లు ఆధారాలు లేవని.. పైగా అతని వద్ద భారత పాస్ పోర్ట్ కూడా లేకపోవడంతో ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందలేదు.
అప్పుడు గుర్ తేజ్ సింగ్ తనకు కొత్త పాస్ పోర్ట్ ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చినా ఎంబసీ అధికారులు ధృవీకరణ పేరుతో అతడి అప్లికేషన్ ని వాయిదా వేస్తూ వచ్చారు. అలా 15 సంవత్సరాలు పాస్ పోర్ట్ కోసం ఎదురు చూస్తూ.. గుర్ తేజ్ ధైర్యం కోల్పోయాడు. ఇక తాను జీవితంలో తన భార్య పిల్లలు చూడలేనని నిరాశతో కుంగిపోయాడు.
కానీ ఇటీవల లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను ప్రభుత్వం తీసుకువచ్చేందకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలోని గుర్ తేజ్ కుటుంబ సభ్యులు.. రాజ్యసభ సభ్యుడు బల్బీర్ సింగ్ సీచెవాల్ను సంప్రదించి.. గుర్ తేజ్ లెబనాన్ ఎలాంటి కష్టాల్ల ఉన్నాడో తెలిపారు. అతడిని ఎలాగైనా ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కోరారు. బల్బీర్ సింగ్ వెంటనే విదేశాంగ మంత్రిత్వశాఖకు జరిగినదంతా వివరించడంతో లెబనాన్ లో గుర్ తేజ్ సింగ్ కు పాస్ పోర్ట్ లభించింది. దీంతో గుర్ తేజ్ సింగ్ దాదాపు 23 ఏళ్ల తరువాత పంజాబ్ లోని లుధియానా చేరుకున్నాడు. ఇప్పుడు అతని వయసు 55 ఏళ్లు. ఇంట్లో అతని తల్లి, సోదరుడు చనిపోయారు. అతని ఇద్దరు పిల్లలకు వివాహం జరిగింది. గుర్ తేజ్ సింగ్ కు మనవళ్లు కూడా ఉన్నారు. ఇదంతా చూసి గుర్ తేజ్ సింగ్ తాను ఎంత సమయం కోల్పోయానో అర్థం చేసుకున్నాడు. అందుకే చట్టవ్యతిరేకంగా దేశ సరిహద్దులు దాటకూడదని మీడియాతో మాట్లాడుతూ సందేశమిచ్చాడు. తనకు సాయం చేసిన రాజ్యసభ సభ్యుడు బల్బీర్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు.