Chakwal Molest : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది మగపిల్లలపై ఇద్దరు టీచర్లు లైంగిక దాడులకు పాల్పడ్డారు. మహిళా టీచర్లే ఈ ఘాతుకానికి పాల్పడటం తీవ్ర సంచలనానికి దారితీసింది. పాకిస్థాన్ లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న ఒక స్కూల్ లో దుర్గార్మమైన ఘటన జరిగింది. ఈ కేసులో నిందితులైన ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ ప్రావిన్స్ లో కొంతకాలంగా ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని పంజాబ్ ప్రావిన్స్ ఐజీ ఉస్మాన్ అన్వర్ సోమవారం వెల్లడించారు. ఈ కేసులో బాధిత విద్యార్థులంతా 10-12 ఏళ్ల వయసులో వారేనని తెలిపారు. 15 మంది విద్యార్థులు తమపై ఎలాంటి ఘోరాలు జరిగాయో పోలీసులు, ఉన్నతాధికారులకు వెల్లడించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. బాధిత విద్యార్థుల్లో ఒక విద్యార్థి తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
ప్రతిరోజూ మాదిరిగానే కొడుకును స్కూల్ కు పంపగా.. ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావని తండ్రి ఎంత అడిగినా చెప్పని బాలుడు.. కాసేపటికి అసలు విషయం చెప్పాడు. తన తోటి స్నేహితులపై కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారని చెప్పడంతో.. అతను వెంటనే పంజాబ్ ప్రావిన్సు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాలకు వెళ్లి విచారణ చేయగా సంచలన నిజాలు వెల్లడయ్యాయి. జీషన్, అనిస్ అనే ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులను ఆసుపత్రికి తరలించి మెడికల్ టెస్టులు చేయించారు. రిపోర్టులలో వారిపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో పాటు.. పిల్లల ఒంటిపై పంటిగాట్లు ఉన్నట్లు కూడా నిర్థారణ అయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ పంజాబ్ సీఎం మోహ్ సిన్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని పంజాబ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు.