IT: ఐటీ రంగంలో గందరగోళం నెలకొంది. మాంద్యం దెబ్బకు దిగ్గజ కంపెనీలు కూడా దివాళా తీస్తున్నాయి. కరోనా సమయంలో పోటీ పడి మరీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమ ఎక్కువగా అమెరికాపై ఆధారపడినందున అక్కడి ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంది.
ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 50 వేల మంది తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. త్వరలోనే ఈ సంఖ్య డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తొలగింపులు భారీగా ఉంటాయని.. ఈ ఏడాది మొత్తం తొలగింపుల పర్వం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
అయితే సాంకేతిక మార్పుల కారణంగా ప్రస్తుతం ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నప్పటికీ.. అతి త్వరలోనే అధికంగా కొత్త టెక్నాలజీలో ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ సాంకేతికతల్లో కొత్త ఉద్యోగాలు భారీగా లభిస్తాయని చెబుతున్నారు. ఐదేళ్ల కోసారి ఐటీ రంగంలో సాంకేతిక మార్పులు రావడం సహజమేనని, పాత నైపుణ్యాలకే పరిమితమైన వారి ఉద్యోగాలు పోవడం సాధారణమేనని తెలిపారు.
ఎవరైతే తాజా అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారో.. కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటారో వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని ఐటీ రంగ పరిశీలకులు చెబుతున్నారు. పదేళ్ల నాటి నైపుణ్యాలతో ఇప్పుడు పనిచేసే పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో లేదని స్పష్టం చేశారు.