Terror Attack : జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలో భద్రతా బలగాలపై ముష్కరుల దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన ఘటన యావత్ భారతావణిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండో దాడి జరగడంతో ఈ విషయాన్ని భారత భద్రతా బలగాలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. పూంఛ్ సెక్టార్ వెంబడి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. అడుగడుగునా పటిష్ఠ బందోబస్తుతో గాలింపు ఆపరేషన్తో జల్లెడపడుతున్నాయి. అయితే ఈ దాడి చేసింది తామే అని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ వెల్లడించింది.
జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై దాడి వెనుక పాకిస్తాన్, చైనా హస్తమున్నట్లు భారత రక్షణశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లోని సరిహద్దులో చైనా-భారత్ బలగాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొనడంతో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ రైఫిల్స్ను పూంఛ్ సెక్టార్ నుంచి లద్దాఖ్కు తరలించారు. దీంతో చైనా ఆటలు సాగకపోవడంతో.. పాకిస్థాన్.. తమ ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్లోకి పంపించడం మొదలుపెట్టింది. పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ లక్ష్యంగా ఇటీవల పెరిగిన ఉగ్ర దాడుల ఘటనలకు చైనా, పాకిస్తాన్ ఉమ్మడి వ్యూహమే కారణమని రక్షణశాఖ విశ్వసిస్తుంది. ఆర్మీపై దాడుల ద్వారా భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఇప్పటికే పూంఛ్ అటవీ ప్రాంతాల్లోకి 25 నుంచి 30 మంది వరకు ఉగ్రవాదులను దొంగచాటుగా పంపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అలా భారత్లోకి ప్రవేశించిన ముష్కరులు సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారు.
లద్దాఖ్ సరిహద్దులో భారీగా మోహరించిన ఆర్మీని మరోవైపు తరలించేలా భారత్పై ఒత్తిడి పెంచేందుకే పాక్, చైనా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్-చైనాలు సహకరించుకుంటూ పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు అంచనా వేస్తున్నాయి భారత రక్షణశాఖ వర్గాలు. ఈ క్రమంలో పూంఛ్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు దాగివున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి జాడను పసిగట్టేందుకు స్నిఫర్ డాగ్లు, డ్రోన్ల సాయంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటవీప్రాంతంలో భారీ ఎత్తున భద్రత బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రదేశానికి దగ్గరలో అనుమానాస్పద రీతిలో మూడు మృతదేహాలను సైన్యం గుర్తించింది.
గల్వాన్ సంక్షోభం అనంతరం లద్దాఖ్కు భారీగా సైన్యాన్ని తరలించడం చైనాకు రుచించడం లేదు. దీంతో భారత్ దృష్టిని తిరిగి కశ్మీర్ వైపు మళ్లించేందుకు.. పాక్తో కుమ్మక్కయి పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేసేందుకు పూనుకుంది డ్రాగన్ కంట్రీ. 2020లో ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను పూంఛ్ నుంచి లద్దాఖ్కు తరలించడంతో.. ఎంతో కీలకమైన లద్దాఖ్ ప్రాంతంలో చైనాపై భారత్దే పైచేయి సాధించింది. అటు పూంఛ్లో ఉగ్రవాదులను నిలువరించే వనరులు లేకపోవడంతో.. ఈ విషయం గ్రహించిన చైనా పూంఛ్లో పాక్కు దన్నుగా నిలుస్తూ ఉగ్ర చర్యలకు ఊతమిచ్చిచిందని భారత రక్షణశాఖ చెబుతోంది. పూంచ్, రజౌరి నుంచి భారత రక్షణ బలగాలను లద్దాఖ్కు తరలించినప్పటి నుంచి ఏడాది కాలంగా పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి.
ఈ సమయంలో భారత సైన్యం మరో బ్రిగేడ్ను అక్కడి తరలించి ముష్కరులపై పైచేయి సాధించింది. అయితే ఈ నెల 21న సురాన్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గలి– బఫ్లియాజ్ మార్గంలో ఉన్న ధట్యార్ మోర్హ్ సమీపంలోని మలుపులో ఎత్తైన కొండపై నక్కి ఉన్నారు. భారత సైన్యమే లక్ష్యంగా దాగివున్న ముష్కరులు.. బలగాలతో వెళ్తున్న రెండు వాహనాలు..బ్లైండ్ కర్వ్లో కాస్త స్లో కాగానే కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు భారత జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.