PM Modi’s visit to Moscow will see discussions on energy trade
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యాకు వెళ్లనున్నారు. 22వ రష్యా, భారత వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. జులై 8, 9 తేదీలలో మోదీ రష్యా రాజధాని మాస్కోలో ఉంటారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఐదేళ్ల తర్వాత ప్రధాని రష్యా పర్యటించనుండటం విశేషం. కరోనా నేపథ్యంలో దాదాపు మూడేళ్ల పాటు ఏ దేశాన్ని సందర్శించని మోదీ ఆ తర్వాత వరుస ఎన్నికల హడావిడితో రష్యా పర్యనటలో పాల్గొనలేదు. ఇప్పుడు మూడో సారి ప్రధాన మంత్రి హోదాలో తొలి సారి రష్యా పర్యటన చేయనున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే మొదటి సారి. 2019 లో వ్లాడివోస్టాక్ లో ఆర్థిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మోదీ హాజరయ్యారు. దాని తర్వాత మోదీ రష్యా సందర్శించడం ఇదే కావడం విశేషం. భారత్, రష్యా మధ్య ఇప్పటిదాకా 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి.
సమకాలీన సమస్యలపై దృష్టి
చివరిగా ఈ రెండు దేశాల మధ్య 2021 డిసెంబర్ ఆరున న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు రష్యా అధ్యక్షుడే న్యూ ఢిల్లీకి వచ్చారు. ఈ పర్యటన భారత్, రష్యా వాణిజ్య సంబంధాలకు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. రష్యా దేశంలో అధికారిక వార్తా సంస్థ అయిన టాస్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడం విశేషం.ఇరు దేశాల అధ్యక్షులు సమకాలీన ప్రపంచ సమస్యలు, ప్రాంతీయ అంశాలపై చర్చించుకోనున్నారు. సోమ, మంగళవారాలు మోదీ రష్యాలోనే ఉండనున్నారు. ఈ పర్యటనతో భారత్-రష్యా ల మధ్య పరస్పర అవగాహన, సత్సంబంధాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ఆర్థిక, వాణిజ్య ఒడంబడికలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.