Yoga: మోదీ ఏం చేసినా గ్రాండ్గానే చేస్తారు. అది అమెరికాలో అయితే మరింత గ్రాండ్. ఈసారి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకే ఎక్కేలా చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ న్యూయార్క్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం దగ్గర యోగా నిర్వహించారు. అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో.. ఈ యోగా షో గిన్నిస్ రికార్డ్స్లో చేరింది.
యూఎన్వో అధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో పాటు.. మొత్తంగా 180 దేశాలకు చెందిన ప్రముఖులు, ఎన్నారైలు ఒకేచోట యోగా చేశారు. న్యూయార్క్ మేయర్, గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కెజ్, యాక్టర్ రిచర్డ్ గేర్, ప్రియాంక చోప్రా, సింగర్ ఫాల్గుణి షా.. తదితరులతో కలిసి ప్రధాని యోగా చేశారు.
యోగా ఏ ఒక్క దేశానికో, మతానికో, వర్గానికో చెందినది కాదన్నారు ప్రధాని మోదీ. యోగాకు ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీలు కూడా లేవన్నారు. యోగా భారత్ నుంచి వచ్చిందని.. అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని.. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోతుందని చెప్పారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని.. ఇది పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరం.. అన్నారు ప్రధాని మోదీ.