PM Modi: గతంలో అమెరికాలో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో. ప్రధాని మోదీ మెగా షోతో ఆసీస్కు దిమ్మతిరిగిపోయింది. సిడ్నీలో 20 వేల మంది ప్రవాస భారతీయులతో మోదీ ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ విశేష ప్రేక్షకాదరణ చూసి.. ఆ మోదీ ఇమేజ్ కి మైమరిచి.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్కు మైండ్ బ్లాంక్ అయింది. మోదీ ఈజ్ ది బాస్.. అంటూ తెగ పొగిడేశారు. అట్లుంటది మన మోదీతోని.
ఇక, ఎప్పటిలానే తనదైన స్టైల్లో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ‘టాలెంట్ ఫ్యాక్టరీ’ భారత్లో ఉందన్నారు. కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. ఈ ‘3C’లు మన రెండు దేశాలను కలుపుతున్నాయని ఆస్ట్రేలియన్లను ఉద్దేశించి అన్నారు. ‘3C’లతో పాటు ‘3D’లు.. డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ.. వాటితో పాటు ‘3E’.. ఎనర్జీ, ఎకనామీ, ఎడ్యుకేషన్ల గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ.
కొన్ని తరాలుగా క్రికెట్ రెండు దేశాలను కలిపి ఉంచుతుండగా.. ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, యోగా, ప్రవాసభారతీయ కమ్యూనిటీ.. ఆసీస్-ఇండియా బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని మోదీ తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రజలు విశాలహృదయులని.. భారతీయులను అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయన్నారు. త్వరలోనే బ్రిస్బెన్లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నామని.. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థను ఐఎంఎఫ్ ఒక ఆశాకిరణంగా చూస్తోందన్నారు మోదీ. ప్రతీ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని.. కానీ, భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కటే సేఫ్గా ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుందని.. 150 దేశాలకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత ఇండియాదే అన్నారు మోదీ. అందుకే ప్రస్తుతం భారత్ను విశ్వగురు అంటున్నారని చెప్పారు.
భారత ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని, రాక్స్టార్ రిసెప్షన్ ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కొనియాడారు. ప్రధానిని అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. “చివరిసారిగా నేను ఈ వేదికపై బ్రూస్ స్ప్రింగ్స్టీన్ను చూశాను. ఆయనకు కూడా ఇంత స్పందన రాలేదు. మోదీ ఈజ్ ది బాస్” అంటూ ప్రధానిని పొగిడారు అల్బనీస్.