Pig Heart Transplant : గతంలో అమెరికా దేశంలో ఒక వ్యక్తికి గుండె సర్జరీ చేసి ఒక పంది గుండెను వైద్యులు అమర్చిన విషయం మీరు వినే ఉంటారు. ఆ వ్యక్తి ఆపరేషన్ తరువాత ఆరోగ్యంగా ఉన్నా.. దాదాపు రెండు నెలల తరువాత చనిపోయాడు. ఇప్పుడు అలాగే మరో వ్యక్తి కూడా పంది గుండె అమర్చిన 40 రోజుల తరువాత మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. లారెన్స్ ఫాసెట్(58) అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరమైన మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్ప్టాంట్ సర్జరీ ద్వారా అమర్చారు. కానీ ఆపరేషన్ జరిగిన దాదాపు 40 రోజుల తరువాత ఆ పంది గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ అక్టోబర్ 30న మరణించారు.
ఈ విషయం సర్జరీ చేసిన మేరిల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు ధృవీకరించారు. ఆపరేషన్ జరిగిన నెల రోజులపాటు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. ఆ తరువాత కేవలం పది రోజుల నుంచి లారెన్స్ అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేస్తే గుండె పనితీరు క్షీణించినట్లు తెలిసిందని వైద్యులు పేర్కొన్నారు.
‘గుండె మర్పిడి ఆపరేషన్ తరువాత లారెన్స్ ఆరోగ్యంగా కనిపించేవారు. ఫిజికల్ థెరపీలో చురుగ్గా ఉండేవారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసేవారు. తన భార్య ఆన్తో కార్డ్స్ ఆడుతూ సరదాగా ఉన్నారు. అనుకోకుండా ఆయనకు అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేశాం. ఆయన గుండె పనితీరు సరిగా లేదని స్పష్టమైంది. చికిత్స చేస్తుండగా.. ఆ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. మానవ అవయవాల మార్పిడి విధానంలో గుండె మార్పిడి చాలా క్లిష్టమైనది,’ అని మేరీల్యాండ్ వైద్యులు చెప్పారు.
లారెన్స్ ఇంతకుముందు నేవీలో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో టెక్నీషియన్గా రిటైర్డ్ అయ్యారు. గుండె సమస్యలతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఆయనకు గుండె మార్పిడి చేయడం కష్టమని డాక్టర్లు తెలిపారు. కానీ ఆయనకు పంది గుండె సరిపోతుందని భావించి మార్పిడి చేయగా.. లారెన్స్ కొంతకాలమైనా ఆరోగ్యంగా బతికారని ఆయన భార్య ‘ఆన్’ తెలిపింది.
మనుషులకు పంది గుండె అమర్చే ప్రక్రియను క్సెనో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని వైద్య నిపుణుల అభిప్రాయం.
అయితే ఈ గుండె మార్పిడి చేయాలంటే సదరు వ్యక్తికి సరిపోయే గుండె దొరకాలి.ఒకవేళ దొరికిన కూడా ఆ గుండె బ్లడ్ గ్రూపు అలాగే కణాలు కూడా మ్యాచ్ అయితేనే గుండెను ఇతర వ్యక్తికి అమర్చవచ్చు.. ఒకవేళ ఇవేవీ మ్యాచ్ కాకపోతే ఆ గుండెను అమర్చరాదు. ఇలా అవయవ దాతల కొరత వల్ల చాలా మంది హృద్రోగులు చనిపోతున్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం వైద్యరంగంలోని శాస్త్రవేత్తలు గత కొంత కాలంగా జంతువులపై పరిశోధన చేసి జన్యుపరమైన మార్పులు చేసిన పంది గుండె.. మనుషులకు అమర్చేందుకు ఉపయోగించవచ్చని నిర్ధారించారు.
ఈ జన్యుపరమైన మార్పులు చేసిన పంది గుండెకు మనిషి గుండెతో పోలికలు ఉంటాయి. దీంతో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వైద్య నిపుణులు మొట్టమొదటిసారిగా డేవిడ్ బెన్నెట్(57) అనే వ్యక్తికి జనవరి 7, 2022న ఏడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి పంది గుండెను అమర్చారు. డేవిడ్ ప్రాణాలను కాపాడటానికి చివరి అవకాశంగా ఈ గుండె మార్పిడి చేశారు. ఆపరేషన్ తరువాత డేవిడ్ రెండు నెలల పాటు ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు అమర్చిన గుండె ఆగిపోవడంతో ఆయన మార్చి 6,2022న చనిపోయారు.