Peru : గత ఆరు దశాబ్దాల్లో పెరూ సగానికి పైగా గ్లేసియర్ సర్ఫేస్ను కోల్పోయింది. ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే దీనికి కారణం. పర్యావరణ మార్పుల ఫలితంగా 2016-20 మధ్య నాలుగేళ్లలోనే 175 హిమానీనదాలు మాయమయ్యాయి.
58 ఏళ్లలో 56.22% మేర మంచుదిబ్బలు(Glaciers) కరిగిపోయాయని పెరూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చి ఆఫ్ మౌంటెన్ గ్లేసియర్స్ అండ్ ఎకో సిస్టమ్స్ తెలిపింది. దక్షిణ అమెరికాలో ప్రస్తుతం 1050 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మంచుదిబ్బలు ఆవరించి ఉన్నాయి.
1962 నాటి మొత్తం గ్లేసియర్లలో ఇది 44 శాతమే. కొన్ని పర్వతాలపై గ్లేసియర్లు అయితే పూర్తిగా మాయమయ్యాయి. హిమానీనదాలు స్వల్ప ఉష్ణోగ్రతల పెరుగుదలకు సైతం కరిగిపోయేంత చాలా సున్నితంగా ఉంటాయి. అనూహ్య వాతావరణ మార్పులు, వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల హిమాలయ ప్రాంతంలోని గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాలకు, జీవనోపాధికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందూ కుష్ (Hindu Kush) హిమానీనదాలు 2011 నుంచి 2020 మధ్య కాలంలో మునుపటి దశాబ్దంతో పోలిస్తే 65% వేగంగా కరిగినట్టు ఆ అధ్యయనం పేర్కొంది.
భూమిపై దొరికే జలంలో 2.1% గ్లేసియర్ల రూపంలోనే ఉంది. ఇవి కరగడం వల్ల పల్లపు ప్రాంతాల్లో నివసించేవారికి ముప్పు
తప్పదు. హిమానీనదం కరిగినప్పుడు మంచు ఉన్న భూమి అస్థిరంగా మారి కదలడం ప్రారంభిస్తుంది. కరిగే అదనపు నీరు దానిని సులభంగా ముందుకు నెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.. తత్ఫలితంగా విధ్వంసక ప్రవాహాలు ఏర్పడే ముప్పు ఉంటుంది.