Pakistan terrorists target attacks vehicles..rail..police stations 73 dead: పాకిస్తాన్ దేశంలో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కార్మికులను లక్ష్యంగా జరిపిన దాడులలో 73 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇదే క్రమంలో బెలూచిస్తాన్ పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ లు, పోలీసు స్టేషన్లను టెర్రరిస్టులు ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పాక్ అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో పాకిస్తాన్ భద్రతా దళ సిబ్బంది కూడా పధ్నాలుగు మంది ఉన్నారని తెలిపింది. అయితే ఉగ్రవాదులు అత్యంత హేయంగా రోడ్డు మీద వెళుతున్న వాహనాలను ఆపి వారి ఐడీ కార్డులు చెక్ చేసి వెంటనే తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. అప్పటికీ వాహనదారులను చంపినా కోపం చల్లారక వారి వాహనాలను దగ్ధం చేశారు. కేవలం మూసా ఖైల్ అనే ప్రాంతంలోనే దాదాపు 40 వాహనాలను విధ్వంసం చేశారు ఉగ్రవాదులు.
ఉపాధి కోల్పోతున్నారనే..
పాక్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వలస కార్మికుల వలన అక్కడి స్థానిక ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారని అందుకే ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై పలు పాక్ మీడియా చానళ్లు వార్తా కథనాలు ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని బీఎల్ఏ సంస్థ ప్రకటించింది. కాగా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు నిందితులు పాల్పడ్డారని పాక్ హోం శాఖ మంత్రి మెహిసిన్ నఖ్వీ అన్నారు. కాగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మాట్లాడుతూ ఈ దాడి అత్యంత అనాగరికమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించామని తెలిపారు. టెర్రరిస్టులను ఉపేక్షించబోమని..అమాయకులైన పౌరుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.