Update on Pakistan Election 2024 Results:
పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ లీడ్ లో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో పీపీపీ దాదాపు 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ( పీటీఐ) మద్దతు ఉన్న అభ్యర్థులు 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఇంకా అధికారకంగా ఫలితాలను వెల్లడించలేదు.
శుక్రవారం వేకువజామున 3 గంటలకు తొలి ఫలితాన్ని ప్రకటించిన తర్వాత కౌంటింగ్ నిలిపివేయడంతో నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. తిరిగి శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపిస్తోంది. భద్రతా, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని పాకిస్థాన్ హోంశాఖ వివరణ ఇస్తోంది.
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ దాదాపు 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కౌంటర్ పునఃప్రారంభమైన తర్వాత వారి ఆ పార్టీ లీడ్స్ సంఖ్య పెరిగింది. అందువల్ల నవాజ్కు అనుకూలంగా ఓట్లు తారుమారు అయినట్లు పీటీఐ ఆరోపించింది.
పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో పీపీపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాహోర్ స్థానం నుంచి గెలుపొందారు.
గత జాతీయ ఎన్నికలలో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ గెలిచింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , శక్తివంతమైన సైన్యం మద్దతు ఇస్తున్న షరీఫ్ పీఎంఎల్-ఎన్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. శుక్రవారం కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 266 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. మిగతా 70 స్థానాల్లో 10 మైనార్టీలకు, 60 సీట్లు మహిళలకు రిజర్వే చేశారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణంతో పోలింగ్ జరగలేదు. దీంతో 265 స్థానాల్లోనే ఎన్నికలు జరిగాయి. సాధారణ మెజారిటీ కోసం ఏదైనా పార్టీకి పార్లమెంటులో 133 సీట్లు అవసరం.
ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద సైనికులను గణనీయంగా మోహరించారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులను తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ పోలింగ్ సమయంలో హింస చెలరేగింది. బాంబు పేలుళ్లు సంభవించాయి. గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పులు లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పిల్లలు సహా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
వాయవ్యంలో డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచి ప్రాంతంలో బాంబు పేలుడులో ఐదుగురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరపడం లాంటి విద్రోహ చర్యలు జరిగాయి. బలూచిస్థాన్లోని మహిళా పోలింగ్ స్టేషన్ వెలుపల జరిగిన పేలుడులో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా హింస , మొబైల్ కమ్యూనికేషన్ సేవలను నిలిపివేయడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.