ఇరాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. బలూచిస్థాన్లోని మిలిటెంట్ గ్రూప్లపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ప్రతిగా పాకిస్థాన్ ఈ చర్య చేపట్టింది. ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ‘టెర్రరిస్టుల రహస్య స్థావరాలు’ లక్ష్యంగా చేసుకొని ఈ వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.
బలూచిస్థాన్లో ఇరాన్ చేసిన దాడులకు తీవ్ర పరిణామాలుంటాయని పాకిస్థాన్ హెచ్చరించిన.. 24 గంటల్లోనే ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఇరాన్ భూభాగంలోని ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్’, ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ స్థావరాలపై పాక్ గురువారం వైమానిక దాడులు చేసినట్లు వచ్చిన వార్తలను ఆ దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మంగళవారం ఇరాన్ తమ భూభాగంపై జరిపిన క్షిపణి దాడులకు ప్రతికారంగా ఈ దాడి చేశామని ప్రకటన విడుదల చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీనిపై ఇప్పటి వరకు ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
పాకిస్థాన్ దాడికి సంబంధించినవిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పలు ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. అవి తాజా దాడివే అని ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. బలూచిస్థాన్లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంటు గ్రూపునకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు వ్యవధిలోనే పాక్ ప్రతిస్పందించడం గమనార్హం.
ఇరాన్ చేసిన దాడి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉల్లంఘన చర్యగా పాకిస్థాన్ అభివర్ణించింది. ఇరాన్ దాడిపై ఆ దేశ విదేశాంగశాఖలోని సీనియర్ అధికారుల వద్ద దీనిపై పాక్ నిరసన తెలియజేసింది. మిలిటెంట్ల అక్రమ కార్యకలాపాలపై తమతో స్పందించడానికి ఎన్నో మార్గాలున్నాయన్నది. కానీ దాడులను ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం పాక్ రాయబారి ఇరాన్ లోనే ఉన్నారు. ఇరాన్ నుంచి తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని పాక్ ఆదేశించింది.
ఇరాన్ మాత్రం తన రాయబారిని ఇప్పుడే తిరిగి రావొద్దని సూచించింది. దీంతో పాటు భవిష్యత్తులో జరగబోయే అన్ని ద్వైపాక్షిక పర్యటనలను ఉపసంహరించుకుంది. పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో జన సాంద్రత తక్కువగా ఉండే జైష్అల్ అదిల్, ఇతర వేర్పాటువాద గ్రూపులపై పాకిస్థాన్, ఇరాన్ లు దశబ్దాలుగా పోరాడుతున్నాయి.
పాకిస్థాన్లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంట్ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల విషయంలో భారత్ సున్నితంగా స్పందించింది. దేశాలు ఆత్మ రక్షణ కోసం చేపట్టే చర్యలను అర్థం చేసుకుంటామని భారత్ పేర్కొంది. అది ఇరాన్, పాకిస్థాన్ దేశాల మధ్య వ్యవహారమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ బుధవారం ఢల్లీలో స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.