North Korea : ఉత్తర కొరియాలో మరో దాష్టీకం వెలుగులోకి వచ్చింది. అక్కడ అధ్యక్షుడు తాను చెప్పిందే వేదంలా అమలు చేస్తున్నారనే విషయం కొత్తేమీ కాదు. ఇతర దేశాల సంస్కృతి తమ దేశంపై పడకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తుంటారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. ఇటీవల దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూసినందుకు ఇద్దరు విద్యార్థులకు మరణ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్ చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అక్టోబర్లో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ డ్రామాలు చూశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు వారిపై నేరారోపణ చేసినట్లుగా కొరియన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ది ఇండిపెండెంట్ వార్తా సంస్థలో ఇవి ప్రముఖంగా రావడం సంచలనం రేపింది.
ఈ ఘటనతో అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినందుకు వారికి మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం దక్షిణ కొరియాతోపాటు, ఇతర దేశాలకు చెందిన సినిమాలు, డ్రామాలు, వీడియోలు చూడటం, పంపిణీ చేయడం నేరం. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు మైనర్లు అయినా సరే.. నిర్దాక్షిణ్యంగా మరణ శిక్ష విధించేలా ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తుంది.