North Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పొరుగు దేశం దక్షిణ కొరియా, అగ్రదేశం అమెరికాపై యుద్దానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. యుద్దానికి సిద్దం కావాలని సైన్యాన్ని సన్నద్దం చేశారు. ఉత్తరకొరియాకు చెందిన వార్తా సంస్థ కేసీఎన్ఏ ఈ వార్తలను ప్రసారం చేస్తోంది.
అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఈ నెల 21 నుంచి 24 వరకు సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్దమవుతున్నాయి. దీనిపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యాన్ని యుద్దానికి సిద్దం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని కూడా ఆదేశించారు. అటు, సైన్యంలో కీలక పదవుల్లో ఉన్నవారిని కూడా చకాచకా మార్చేస్తున్నారు. సైనిక జనరల్గా ఉన్న పాక్-సు-ఇల్ స్థానంలో కొత్త జనరల్గా రి యాంగ్ గిల్ను నియమించారు.
కిమ్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దంతో ప్రపంచంలో పలుదేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు మరో యుద్దం జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అటు, కిమ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడుగా ఉన్న దేశం యుద్దానికి సిద్దమైతే.. అణ్వాయుధాల వాడకం కూడా జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.