North Korea News: గత కొద్ది రోజుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాను కలిపే సరిహద్దు రోడ్డు మార్గాలను బాంబులతో పేల్చి వేయించారు. ఈ విజువల్స్ ను ఆదేశ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు.
దక్షిణ కొరియా రోడ్డు మార్గం పూర్తిగా మూసివేత
రోడ్ల పేల్చివేతకు సంబంధించి నార్త్ కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో తమకు ఉన్న సరిహద్దు మార్గాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. రోడ్లు క్లోజ్ చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించింది. సైన్యం ఆ పనుల్లో నిమగ్నం అయినట్లు తెలిపింది. రోడ్డు మార్గాలతో పాటు రైల్వే మార్గాలను సైతం క్లోజ్ చేయిస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల నడుమ ఘర్షణ తలెత్తకుండా అమెరికా సైన్యానికి సైతం సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. పొరుగు దేశం రెచ్చగొట్టే చర్యలను ఏమాత్రం సహించేది లేదని నార్త్ కొరియా వెల్లడించింది
సరిహద్దు దగ్గర సైన్యం మోహరింపు
అటు సౌత్ కొరియా బార్డర్ దగ్గర సైన్యాన్ని మోహరించాలని అధ్యక్షుడు కిమ్ ఆదేశించారు. యుద్ధ ట్యాంకులను తీసుకెళ్లాలని సూచించారు. సౌత్ కొరియా డ్రోన్ లు తమ భూభాగంలోకి వస్తే వెంటనే పేల్చివేయాలన్నారు. కిమ్ ఆదేశాలతో బార్డర్ దగ్గర నార్త్ కొరియా సైన్యం మోహరించింది. సౌత్ కొరియా నుంచి చీమను కూడా తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటున్నది.
నార్త్ కొరియా ఆరోపణలను ఖండించిన సౌత్ కొరియా
అటు నార్త్ కొరియా తీరుపై సౌత్ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిమ్ ఆరోపణలను సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండిచారు. తమ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడినా నార్త్ కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రహదారులను కాపాడేందుకు తమ సైన్యం ప్రయత్నిస్తుంటే కిమ్ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు.
2000 సంవత్సరం తర్వాత రోడ్ల నిర్మాణం
గతంలో ఉప్పు నిప్పులా ఉన్న సౌత్-నార్త్ కొరియా నడుమ 2000 సంవత్సరం నుంచి సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల నడుమ రోడ్డు మార్గాలు నిర్మించారు. రెండు రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. వీటి దగ్గర భద్రత కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తర కొరియా పలు కారణాలు చెప్తూ ఈ రోడ్డు మార్గాలను క్లోజ్ చేసింది. ఇప్పుడు ఉన్న మార్గాలను కూడా ధ్వంసం చేసింది.
Read Also: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!