Noida Fire Accident news(Today’s news in telugu): నోయిడాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మురికి వాడలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న ముగ్గురు బాలికలు సజీవ దహనం చెందారు. అలాగే ఆ బాలిక తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ఇంట్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా..ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆస్తా(10), నైనా(7), ఆరాధ్య(5)లు నిద్రల్లోనే మృతిచెందారు. తొలుత అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బాలికలు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురు బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులను నోయిడా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికల తండ్రి దౌలత్ రామ్(32) తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: విషాదం.. బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని ఓ గదిలో బ్యాటరీ చార్జింగ్ పెట్టగా..షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య జరిగిందని స్థానకులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రమాదం జరగకముందు ఇంట్లో ఐదుగురు నిద్రిస్తున్నట్లు తేలింది. అయితే మంచంపై నిద్రిస్తున్న ముగ్గురు బాలికలకు తీవ్రంగా గాయాలై చనిపోగా.. దౌలత్ రామ్(32)కు 70 శాతం వరకు తీవ్రంగా గాయపడడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దౌలత్ రామ్ భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.