Lebanon Airport| ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే భయంతో లెబనాన్ లోని ఏకైక ఎయిర్ పోర్టుకు విమాన రాకపోకలు ఆగిపోయాయి. శనివారం రాత్రి లెబనాన్ సరిహద్దులకు సమీపంగా ఉన్న ఇజ్రాయెల్ భూభాగం గోలన్ హైట్స్ లో రాకెట్ దాడి ఘటనలో 12 మంది టీనేజ్ పిల్లలు చనిపోయారు. ఈ దాడి లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు.
ఈ ఘటన తరువాత అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. ”హెజ్బుల్లా ఈ దాడికి తగిన మూల్యం చెల్లించాలి.. అది ముందెవరో కనీవిని ఎరుగని రీతిలో భారీ మూల్యం ఉంటుంది. ఇక వినాశనం తప్పదు,” అని ఉద్రేకంగా చెప్పారు. ఆ తరువాత దేశానికి తిరిగి వచ్చి రక్షణ మంత్రి యాఒవ్ గల్లాంత్ తో అత్యవర చర్చలు చేశారు. దాడి జరిగిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం భార సంఖ్యలో హెజ్బుల్లాపై రాకెట్ దాడులు చేసింది. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా కూడా తిరిగి దాడులు చేసింది.
ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ చేసిన రాకెట్ దాడిలో లెబనాన్ లోని షఖ్రా పట్టణంలో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో లెబనాన్ రాజధాని బేరూట్ లోని ఏకైక ఎయిర్ పోర్టుకు విమాన రాకపోకలు జరిపేందుకు విమానయాన సంస్థలు భయపడుతున్నాయి. దీంతో బేరూట్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన వందల విమానాలు రద్దు అయ్యాయి. లెబనాన్ కు చెందిన మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ తమ విమానాలకు ఇన్సూరెన్స్ రిస్క్ ఉందని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తే, ప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీ లుఫ్తాన్సా జూలై 30 వరకు భద్రతా కారణాలు చూపుతూ విమానాలు రద్దు చేసింది.
వీటితో పాటు , టర్కీ ఎయిర్ లైన్స్, ఏజియన్ ఎయిర్ లైన్స్ కూడా బేరూట్ కు వెళ్లే విమానాలు రద్దు చేశాయి. యుద్ధ వాతావరణం నెలకొనడంతో లెబనాన్ లో రవాణా, పర్యటక రంగం స్తంభించిపోయింది.
హెజ్బుల్లా మిలిటెంట్లు సాయుధ పోరాటంలో శిక్షణ పొందారు. సైన్య బలం కూడా హమాస్ తో పోలిస్తే చాలా పెద్ది. ఆయుధాల విషయంలో ఇరాన్ నుంచి నిరవధికంగా సరఫరా ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ వెనుక ఏకంగా అమెరికా ఉంది. ఈ రెండు శక్తులు యుద్ధం చేస్తే.. భారీ వినాశనం జరుగుతుందనడంలో సందేహం లేదు.
Also Read: ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా నాశనం తప్పదా?..