Nipha Vaccine : ప్రాణాంతక నిఫా వైరస్(NiV)పై పోరులో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 75 శాతానికి పైగా మరణానికి అవకాశం ఉన్న ఈ వైరస్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. మానవులపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఆరంభమయ్యాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్ దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
1998-99లో తొలిసారి నిఫా వైరస్ మలేసియా, సింగపూర్ దేశాల్లో వెలుగుచూసింది. పందులు, గబ్బిలాల నుంచి ఇది సంక్రమిస్తుంది. వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకితే 40-75 శాతం మరణించే అవకాశాలు ఉంటాయి.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాండమిక్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ChAdOx1 NipahB వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. 51 మంది వాలంటీర్లపై దీనిని పరీక్షించారు. వ్యాక్సిన్ భద్రత, ఇమ్యూన్ వ్యవస్థ ప్రతిస్పందించే వైనాన్ని ఈ పరీక్షల ద్వారా పరిశీలిస్తారు. ఈ ట్రయల్స్ ఏడాదిన్నర పాటు కొనసాగుతాయి.
అంతకుముందు దీనిని జంతువులపై పరీక్షించారు. తద్వారా వైరస్ను సమర్థంగా నిలువరించగలిగినట్టు తేలింది. నిఫా వైరస్ ప్రబలిన దేశంలో క్లినికల్ ట్రయల్స్ రెండో దశను చేపడతారు. ఇప్పటి వరకు ఈ వైరస్కు టీకా అన్నదే లేదు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కాగలిగితే.. మరో మహమ్మారి నుంచి ప్రపంచం సురక్షితంగా బయటపడినట్టే.