USA: మాంద్యం దెబ్బకు ఐటీరంగం అల్లాడిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న నుంచి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్, ఫేస్బుక్, టిండర్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎంప్లాయిస్ ఉద్యోగం ఊడి రోడ్డున పడ్డారు.
అయితే ఓ వైపు కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తీసేస్తుంటే.. అమెరికాలో మాత్రం రికార్డుస్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతోంది. పోయిన ఏడాది డిసెంబర్లో 2.69 లక్షల ఉద్యోగాలు కల్పించగా.. జనవరిలో 5.17 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
ఈ పరిస్థితుల దృష్టా ఇటీవల ఉద్యోగం కోల్పోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సులభంగానే ఉద్యోగం దొరుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు సాంకేతిక మార్పుల కారణంగా ప్రస్తుతం ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నప్పటికీ.. అతి త్వరలోనే అధికంగా కొత్త టెక్నాలజీలో ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ సాంకేతికతల్లో కొత్త ఉద్యోగాలు భారీగా లభిస్తాయని చెబుతున్నారు. ఐదేళ్ల కోసారి ఐటీ రంగంలో సాంకేతిక మార్పులు రావడం సహజమేనని, పాత నైపుణ్యాలకే పరిమితమైన వారి ఉద్యోగాలు పోవడం సాధారణమేనని తెలిపారు.
ఎవరైతే తాజా అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారో.. కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటారో వారికి ఉద్యోగ భద్రత ఉంటుందని ఐటీ రంగ పరిశీలకులు చెబుతున్నారు. పదేళ్ల నాటి నైపుణ్యాలతో ఇప్పుడు పనిచేసే పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో లేదని స్పష్టం చేశారు.