New zealand: గాబ్రియేల్ తుఫాన్ దెబ్బకు న్యూజిలాండ్ అతలాకుతలమవుతోంది. ఆ దేశ ఉత్తర భాగంలో తుఫాన్ ధాటికి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనాలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అధికారులు రైల్వే స్టేషన్లు, పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు.
ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. మొదటిసారి 2011లో క్రైస్ట్చర్చ్ భూకంపం సంభవించిన సమయంలో విధించగా.. 2020లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి విధించింది.