Nasa : అంగారక గ్రహం (Mars )పైకి మొదటి సారిగా అడుగుపెట్టిన హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’ ప్రయాణం ఇక ముగిసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (Nasa) అధికారికంగా ప్రకటించింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డులోకెక్కింది. తాజాగా ఆ హెలికాప్టర్ను అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా.. దాని రోటార్లు దెబ్బతిన్నాయి.
ఇంజెన్యూటీ హెలికాప్టర్ అంచనాలకు మించి పని చేసిందని నాసాకు చెందిన బిల్ నెల్సన్ అన్నారు. మన సౌర వ్యవస్థలో ఎగరడానికి ఇంజెన్యూటీ అవసరమైన మార్గాన్ని సుగమం చేసిందని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో మానవులు చేపట్టే ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజెన్యూటీ సాధారణ స్థితిలో నిలబడి ఉన్నా.. బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దానితోపాటు ఉన్న గ్రౌండ్ వెహికల్ పంపిన ఫొటోల్లో ఇది కనిపించిందని ఆయన పేర్కొన్నారు. అది ఇక ఎగిరే స్థితిలో లేదని వెల్లడించారు.
అంగారక గ్రహంపై ఉన్న ఇంజెన్యూటీ పరిస్థితులను విశ్లేషిస్తున్నామని నాసా తెలిపింది. ఇంజెన్యూటీని 2021లో నాసా ప్రయోగించింది. పర్సెవరన్స్ అనే రోవర్ గర్భంలో దీనిని ఉంచి అక్కడికి చేర్చింది. భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. అందుకే ల్యాండింగ్తో పాటు, పైకి ఎగరడం కూడా కష్టమవుతుంది. దీని ద్వారా అంగారక గ్రహంపై కీలక సమాచారం సేకరించే అవకాశం లభించింది.
గతేడాది ఏప్రిల్ నాటికి ఇంజెన్యూటీ 50 ప్రయాణాలను పూర్తి చేసింది. అప్పట్లో అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది. అయినా.. ఇంజెన్యూటీ తన పని కొనసాగించింది. దీని భాగాలను చాలా వరకు స్మార్ట్ఫోన్ ప్రాసెసర్లు, కెమెరాల వంటి మామూలు వాటితోనే రూపొందించటం విశేషం. భవిష్యత్తులో అంగారకుడిపై ఎగిరే హెలికాప్టర్ల తయారీకి ఇది అందిస్తున్న సమాచారం ఉపయోగపడుతుంది.