Myopia In Kids Globally| ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల్లో కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ వార్తా సంస్థ బిబిసి రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు షార్ట్ సైట్ (సమీప దృష్టి) సమస్యతో బాధపడుతున్నారు. సైన్స్ భాషలో దీన్ని మయోపియా అని అంటారు. మయోపియా సమస్య కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కాలంలో విపరీతంగా పెరిగిందని బిబిసి అధ్యయనంలో తేలింది.
మయోపియా సమస్య ఉన్న చిన్నపిల్లల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. 2050 సంవత్సరం కల్లా కోట్ల సంఖ్యలో దీని బాధితులుంటారని బిబిసి తెలిపింది. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల్లు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా లోపలే ఉంటూ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్ లో ఎక్కువ సేపు వీడియోలు చూడడం, వీడియో గేమ్స్ చూడడంతో కళ్లపై ఒత్తిడి పెరిగి మయోపియా సమస్యతల్లెత్తింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆసియా ఖండంలోనే ఈ సమస్య తీవ్రంగా ఉంది. మయోపియాతో బాధపడే చిన్నపిల్లల సంఖ్య.. జపాన్ లో 85 శాతం, సౌత్ కొరియా లో 73 శాతం, చైనా, రష్యాలో 40 శాతం కంటే ఎక్కువగా ఉంది.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. 5 ఖండాలలోని 50 దేశాల చిన్నపిల్లలు, టీనేజర్లపై ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 50 లక్షలమంది డేటాని తీసుకున్నారు. మయోపియా సమస్య బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా దేశాల్లో దాదాపు 15 శాతం చిన్నపిల్లల్లో ఉండగా.. పరాగ్వే, యుగాండా దేశాల్లో తక్కువ స్థాయిలో ఉంది.
ఈ నివేదిక వివరాలు పరిశీలిస్తే.. షాకింగ్ విషయాలు తెలిశాయి. 1990 నుంచి 2023 మయోపియా బాధితుల సంఖ్య దాదాపు మూడింతలు కావడం ఆందోళన కలిగిస్తోంది. మయోపియా చిన్నపిల్లలో 4, 5 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి వయసుతోపాటు కన్ను ఆకారం ఎదగడం ఆగిపోతుంది. దీంతో సమీప దృష్టి సమస్య తీవ్రమవుతుంది.
మయోపియా సమస్యకు ఎక్కువగా వంశపారంపరంగా వస్తుంది. కానీ సరైన జీవన విధానం, చుట్టూ పరిసరాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మయోపియా బాధితులు ప్రపంచవ్యాప్తంగా తూర్పు ఆసియా దేశాల్లో ఉన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ దేశాల్లోని చిన్నపిల్లలు ఎక్కువ సమయం పుస్తకాలు చదవడం, ఫోన్ స్క్రీన్కు అతుక్కుపోయి చూస్తూ ఉండడంతో కంటి కండరాలు ఒత్తడికి గురవుతాయి. దీంతో సమీప దృష్టి సమస్య తలెత్తుంది.
లాక్ డౌన్ సమయంలో ఎక్కవు మంది స్మార్ ఫోన్ స్క్రీన్లకు అలవాటుపడ్డారని అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. 2050 కల్లా ప్రపంచలోని సగం టీనేజర్లు మయోపియా బారిన పడే అవకాశాలున్నాయని.. దీనికి కారణం పిల్లలు ఇంటి లోపలే సమయం గడుపుతున్నారని, అవుట్ డోర్ గేమ్స్ఆడడానికి ఇష్టపడడం లేదని అన్నారు.
మయోపియా బారి నుంచి తప్పించుకోవడానికి ఏడు నుంచి 9 సంవత్సరాల వయసు గల పిల్లలు ప్రతిరోజు కనీసం రెండు గంటలు అవుట్ డోర్ గేమ్స్ ఆడుతూ, లేదా బయట ఇతర వ్యాపకాల్లో పాల్గొంటూ గడపాలని నిపుణులు సూచిస్తున్నారు.