Modi and Biden talk in phone call.. Ukraine issue.. emphasise security for Hindus in Bangladesh: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత రెండున్నరేళ్లుగా దాడులు, ప్రతిదాడులు జరుగుతునే ఉన్నాయి. గత రెండు రోజులుగా మరోసారి సైనిక దాడులు పెరిగాయి. భారీ సంఖ్యలో డ్రోన్స్, రాకెట్ లాంచర్లతో మరోసారి దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న మోదీ ఎలాగైనా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతిని నెలకొల్పాలనే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాధ్యక్షులకూ మోదీ పై ఎంతో గౌరవం ఉంది. రెండు దేశాలూ భారత్ తో స్నేహ బంధాన్ని కోరుకునేవే కావడంతో మోదీ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఇరుదేశాధ్యక్షుల మధ్య చర్చా వేదిక ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.
సుదీర్ఘ చర్చ
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ఇద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ప్రధానంగా బంగ్లాదేశ్, ఉక్రెయిన్ దేశాలలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై చర్చా గోష్టి జరిగింది. ఉక్రెయిన్ పర్యటనలో అక్కడి అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భేటీ సందర్భంగా ఇద్దరూ మాట్లాడకున్న కీలక అంశాలను బైడెన్ కు మోదీ ఫోన్ లో వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంలో ఎలాగైనా శాంతియుత పరిస్థితులు నెలకొనాలనేదే తమ లక్ష్యం అని ఈ విషయంలో బైడెన్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నానని మోదీ అన్నారు.
మధ్యవర్తిత్వం చేస్తా..
అవసరమైతే తన మధ్యవర్తిత్వం కూడా ఉంటుందని తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల ప్రస్తావన కూడా తెచ్చారు. అలాగే అమెరికా, ఇండియా మధ్య సత్సంబంధాలు కొనసాగేలా..ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగేలా చూసుకుందామని చర్చించారు. కొన్ని అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు కృషి చేయాలని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు.