Bao Fan : చైనా దిగ్గజ టెక్ బ్యాంకర్ బావో ఫాన్ ఏడాది క్రితం అదృశ్యమయ్యారు. అయితే తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీలో సీఈవో పదవికి రాజీనామా చేశారు. కుటుంబంతో అధిక సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. తన అదృశ్యానికి కారణాలను మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జింగ్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు. తనకు బోర్డుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజీనామా వెనక వాటాదారులకు చెప్పేంత పెద్ద కారణాలు లేవని బావో పేర్కొన్నారని కంపెనీ ఫైలింగ్లో వెల్లడించారు.
ఒకప్పుడు చైనాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లలో బావో టాప్ లో ఉన్నారు. చైనా రనెసాన్స్ సేవలు పొందుతున్న వాటిలో టెన్సెంట్, అలీబాబా, బైడూ లాంటి దిగ్గజ సంస్థలుండేవి. గతేడాది ఆయన కంపెనీలో చైనా అధికారులు తనిఖీలు చేపట్టారు. వాటికి తాము పూర్తిగా సహకరించామని బావో తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన అదృశ్యమయ్యారు.చైనాలో కొన్నేళ్లుగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలను ప్రభుత్వం అణగతొక్కుతోంది. ఈక్రమంలో బావో అదృశ్యమవడం అనేక అనుమానాలు కలిగించింది.
2020లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికే జాక్ మా కంపెనీపై వివిధ దర్యాప్తులు జరిగాయి.ఆ తర్వాత కొన్నిరోజులపాటు జాక్ మా కూడా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏడాది తర్వాత తిరిగి చైనాకు వచ్చారు. తన కంపెనీలో పదవులకు రాజీనామా చేశారు.