Microsoft: ఐటీ రంగంలో లేఆఫ్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇళ్లకు సాగనంపగా.. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సంఖ్య తమ మొత్తం సిబ్బందిలో ఐదు శాతానికి సమానం.
ఎక్కువగా హ్యుమెన్ రిసోర్సెస్, ఇంజినీరింగ్ విభాగాల్లో తొలగింపులు ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐటీ పరిశ్రమ రానున్న రెండు సంవత్సరాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇటీవల ఓ ఈవెంట్లో లేఆఫ్స్పై సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పోయిన ఏడాది కూడా జూలై, అక్టోబర్లో దాదాపు 1,000 మందికి పైగా ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఇళ్లకు పంపించింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో 2.21 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ ఉద్యోగం ఊడుతుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు.
ఇక కొత్త ఏడాది తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటి వరకు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11 వేల మందిని, ట్విట్టర్ తమ ఉద్యోగుల్లో 50 శాతం మందిని, అమెజాన్ 11 వేలకు పైగా ఉద్యోగులను తీసేసింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నాయి. మరికొన్ని నెలల వరకు లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.