Microsoft: భారత్ సహా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ మొరాయించింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ 360 వంటి సేవలకు అంతరాయం కలిగింది. భారత్, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
అవుట్లుక్ వెబ్సైట్ రీఫ్రెష్ అవ్వకపోవడం, మైక్రోసాఫ్ట్ టీమ్స్ పనిచేయకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. భారత్ నుంచి ఇప్పటి వరకు 3700, జపాన్ నుంచి 900లకు పైగా ఫిర్యాదులు వచ్చాయని డౌన్డిటెక్టర్. కామ్ అనే వెబ్సైట్ వెల్లడించింది.
దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. సమస్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్లు తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించనున్నట్లు వివరించింది.
కాగా, ఇటీవల ట్విట్టర్ సేవలకు కూడా అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. పోయిన ఏడాది డిసెంబర్ 28న సైన్ ఇన్ కాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన ట్విట్టర్ సమస్యను పరిష్కరించింది.