Mark Zuckerberg : ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు.. మరోవైపు ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలు… వెరసి ఉద్యోగుల తీసివేతలు. ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీల నుంచి చిన్న సంస్థల దాకా అన్నింటిదీ దాదాపు ఇదే ధోరణి. ఈ వైఖరితో ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఖర్చుల తగ్గింపు పేరుతో వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు ఆ కంపెనీ చేసిన ఓ పని… తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు సెక్యూరిటీ అలవెన్స్ను పెంచింది… మెటా. అది కూడా 5 శాతమో, పది శాతమో కాదు… ఏకంగా 40 శాతం సెక్యూరిటీ అలవెన్స్ పెంచింది. ఇప్పటిదాకా జుకర్బర్గ్కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్స్ 10 మిలియన్ డాలర్లు కాగా… ఇప్పుడు ఏకంగా 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్లు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.33 కోట్లు పెంచి… రూ.116 కోట్లను ఒక్క సెక్యూరిటీ కోసమే ఖర్చుచేస్తోంది… మెటా. పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతో పాటు జుకర్బర్గ్కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ ఓవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా… మరోవైపు జుకర్బర్గ్కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్ పెంచడాన్ని అంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, పొదుపు పేరుతో ఉద్యోగులను తొలగించిన మెటా… జుకర్బర్గ్కు సెక్యూరిటీ అలవెన్స్ పెంచడానికే 4 మిలియన్ డాలర్లు ఎలా కేటాయిస్తుందని మండిపడుతున్నారు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 16వ స్థానంలో ఉన్న జకర్బర్గ్… 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. 2022కు సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది కాబట్టే… ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్ను ఖరారు చేయడంలో మెటా ఆలస్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.