మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ‘ఈ కమ్యూనిటీ కాంటాక్ట్’ పేరిట అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా రాజారాం గ్రామంలో.. రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ధృవపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఆ తర్వాత గ్రామంలో విస్కృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సీఐ సూచించారు.
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని విద్యాసాగర్ వెల్లడించారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలని వస్తే.. పూర్తి వివరాలు అడిగి.. గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ప్రాణహిత గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో పోలీసులతో కూంబింగ్ నిర్వహించి తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మరోవైపు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అర్థరాత్రి నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కొత్తగూడ, గంగారం వంటి ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రత్యేక బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.