Snake Bite : పాము కాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది చనిపోతున్నారు. మరో 4 లక్షల మంది ప్రాణాలు దక్కించుకో గలుగుతున్నా.. ఏదో ఒక వైకల్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) అంచనా. అయినా ఎవరూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ సమస్య తీవ్రతను తగ్గించడానికి ఏం చేయాలన్న దానిపై యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టా శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది.
పాముకాటు మరణాలు అధికంగా ఉండే తమిళనాడులో సర్వే చేసి పలు సూచనలు కూడా చేసింది. ఈ సర్వేలో 535 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు జనాభా దేశజనాభాలో 5 శాతమే అయినా.. పాముకాటు మరణాలు 20 శాతం వరకు ఉంటాయి. దేశంలో విషపూరిత పాములకు లెక్కలేదు. తాచుపాము, రక్త పింజరి(రసెల్ వైపర్), ఇసుక పింజరి, కట్లపాము వంటివి వాటిలో మరీ డేంజర్. దేశంలో పాము కాటు మరణాల్లో 90 శాతం వాటి వల్లే సంభవిస్తున్నాయి. ఇవి కాటేస్తే నిమిషాల్లోనే మృత్యువు కబళించేస్తుంది.
ఏటా దేశంలో 58 వేల మంది వరకు పాము కాట్లతో మరణిస్తున్నారు. ఒకవేళ బతికి బట్ట కట్టినా.. శాశ్వత వైకల్యం సంభవించే అవకాశాలే ఎక్కువ. పామును చూస్తే ఎవరికైనా భయమే. అందునా విషం కక్కే సరీసృపాలంటే వణికిపోతారు. పాము కాటు మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి శాస్త్రవేత్తల బృందం కొన్ని సూచనలు చేసింది. చెట్లూచేమలు, కొండకోనల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేసే వారిని చైతన్యపర్చడం వాటిలో ఒకటి.
సాధారణ సర్పజాతులు, విషసర్పాల గురించి సవివరంగా తెలియచెప్పడం ద్వారా తొలుత వారిలో భయాందోళనలను తొలగించవచ్చని సూచిస్తున్నారు. అలాగే జీవావరణానికి పాములతో కలిగే ప్రయోజనాలను కూడా విడమరిచి చెబితే.. వాటిని సంహరించాలనే ఆలోచనలు అదే పనిగా తలెత్తవు. భయం కారణంగా మనమే ముందుగా వాటిని చంపేస్తుంటాం. వాస్తవానికి ఆత్మరక్షణలో భాగంగానే పాములు కాటేస్తాయనే విషయాన్ని మరిచిపోరాదు. ఎలకల నుంచి పంటలను కాపాడటంలో సర్పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పరోక్షంగా పంట దిగుబడుల పెంపునకు దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు.
అలాగే మనల్ని కాటు వేసిన పాము ఏదో ముందుగా గుర్తించగలగాలి. ఒక వేళ విషం లేనిదైతే భయపడాల్సిన అవసరం లేదు. టీటీ ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది. పాము కాటు వల్ల కలిగే చిన్న చిన్న దుష్ప్రభావాలను అరికట్టొచ్చు. కాటేసిన పాము విషపూరితమైనదైతే.. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఒకవేళ కాటు వేసిన పామును గుర్తించని పక్షంలో.. వెడల్పాటి గుడ్డను కాటు వేసిన పైభాగంలో కట్టుకట్టాలి. పాము కాటుకు గురయ్యామన్న భయంతోనే చాలా మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
పాము కాటుకు గురైన వారిని ఆహారం ఇవ్వరు. మరి కొందరైతే కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వరు. అంతేకాదు నిద్ర కూడా పోవద్దని చెబుతుంటారు. అపోహలతో ఇలాంటివి చేయడం సరికాదు. పాము కాటుకు గురైన వ్యక్తికి ఆహారం, నీరు ఇవ్వాలి. లేకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇక పాము కాటుకు విరుగుడంటూ ఏవేవో తాయెత్తులు, దారాలు కట్టుకోకూడదు. సమయం వృథా చేయకుండా తక్షణమే ఆస్పత్రికి తరలించాలి.